
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వైవాహిక జీవితంలో సంతృప్తి ప్రాధాన్యతను వివరిస్తూ కీలక సందేశాన్నిచ్చారు. పెళ్లి చూపుల సందర్భంగా అడిగే ప్రశ్నల్లో డబ్బులు, హోదా, ఉద్యోగం వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా, “మీరు ఉన్నదానితో సంతృప్తిగా ఉన్నారా?” అనే ప్రశ్నకే మొదటి స్థానం ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ ఒక్క ప్రశ్న జీవిత భాగస్వాముల మధ్య బంధాన్ని బలపరుస్తుందని, విడాకుల ప్రసక్తి లేకుండా జీవితాంతం సీతారాముల్లా సంతోషంగా జీవిస్తారని గరికపాటి స్పష్టం చేశారు. జీవితంలో ఆపదలు ఎదురైనప్పుడు లేదా కోరుకున్నవి లభించనప్పుడు ఆగడం, నిరీక్షించడం అలవర్చుకోవాలని గరికపాటి తెలిపారు. కొన్నింటికి నెలలు, కొన్నింటికి సంవత్సరాలు ఆగాల్సి వస్తుందని, ఈ ఆగడం అలవాటు చేసుకుంటే ఏ సంబంధం తప్పినా, ఉద్యోగం పోయినా నిరాశ చెందకుండా, ఇంతకంటే మంచిదేదో ఉందని నమ్మకంతో ముందుకు సాగొచ్చని ఆయన అన్నారు. ప్రతి ధాన్యపు గింజ మీద తినేవారి పేరు రాసి ఉన్నట్లు, మనకు రాసిపెట్టింది మనకు తప్పకుండా వస్తుందని, అయితే అలవర్చుకోవాల్సింది సంతృప్తి ఒక్కటేనని గరికపాటి వివరించారు. నేటి సమాజంలో తల్లిదండ్రులు తమ పిల్లల పెళ్లి సంబంధాల విషయంలో ప్యాకేజీలకు, కార్పొరేట్ కంపెనీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇది వైవాహిక జీవితంలో సమస్యలకు దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “నీ ప్యాకేజీ ఎంత? ఆ కంపెనీ ఎందుకు? ఈ కంపెనీ ఎందుకు?” వంటి ప్రశ్నలకు బదులు, “నీకు ఉన్నదానితో నువ్వు సంతృప్తిగా ఉన్నావా?” అని అడగాలని గరికపాటి నొక్కిచెప్పారు.
తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ, తాను ఒకప్పుడు 200 రూపాయల జీతంతో బతికిన రోజులను గుర్తుచేసుకున్నారు. భోజనం అక్కడే, పడుకోవడానికి ఒక బల్ల ఉన్న ఆ రోజుల నుంచి నేడు కోట్లు సంపాదించే స్థితికి వచ్చినా, తనకు సంతృప్తి ఆ 200 రూపాయల జీతం నుంచే వచ్చిందని చెప్పారు. అప్పట్లో 200 రూపాయల్లో బతికినం కదా, ఇప్పుడు 20,000 లేదా 2 లక్షలు వస్తున్నా కూడా అది ఎక్కువగానే అనిపిస్తుందని, పాత రోజులను మర్చిపోకూడదని ఆయన హితవు పలికారు. సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు గుర్తుచేసుకుంటే ఈ ఆశలు ఉండవని, సంతృప్తిని కోరుకోవడమే ముఖ్యమని ఆయన ఉద్బోధించారు. ఒక వ్యక్తి అసంతృప్తిగా ఉంటే, అది ఏ ఉద్యోగం అయినా, ఏ జీతం అయినా సరే, అది వైవాహిక బంధాన్ని కూడా ప్రభావితం చేస్తుందని గరికపాటి పేర్కొన్నారు. అసంతృప్తుడైన వ్యక్తి తాను పనిచేసే కంపెనీకి ద్రోహం చేస్తాడని, అలాగే జీవిత భాగస్వామి పట్ల కూడా న్యాయంగా ఉండలేడని హెచ్చరించారు. డబ్బులు, హోదాలు, అందమే ప్రధానంగా భావించే మనిషిని పెళ్లి చేసుకుంటే జీవితం నాశనమవుతుందని స్పష్టం చేశారు. వినాయకుడిని గొప్ప ఉదాహరణగా గరికపాటి ప్రస్తావించారు. వినాయకుడికి హోదా ప్రధానం కాదని (దానంతట అది వచ్చింది), అందం (ఏనుగు మొహం ఉన్నవాడు అందంగా ఉంటాడని మనం అనుకున్నా అది కాదు) ప్రధానం కాదని, ఐశ్వర్యం (పొట్ట తప్ప ఏమీ లేదు) ప్రధానం కాదని వివరించారు. అయినా శ్రీ మహా విష్ణువు సైతం పూజించేంత గొప్ప దేవుడయ్యారంటే అందుకు ఆయన నిరాడంబరత, ఉన్నదానితో సంతృప్తి పడడమే కారణమని అన్నారు. అటువంటి గుణాలను అలవర్చుకుంటే అంతకంటే గొప్ప విషయం మరొకటి లేదని గరికపాటి నరసింహారావు తన ప్రవచనంలో బోధించారు.