Reading Time: < 1 minute
Petrol Diesel Price Hike Omc Fuel Rates Increased Again

దేశవ్యాప్తంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు చమురు సంస్థలు కోలుకోలేని షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదొడుకుల నెపంతో సామాన్యుడి నడ్డి విరిచేలా ఇంధన ధరలను మరోసారి భారీగా పెంచేశాయి. గత పది రోజుల వ్యవధిలోనే ధరలు పెరగడం ఇది నాలుగో సారి కావడం గమనార్హం. వరుస పెంపులతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న వాహనదారులపై ఈ తాజా నిర్ణయం మరింత భారంగా మారనుంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు శరవేగంగా రేట్లను సవరిస్తూ ఈ తాజా వాత పెట్టాయి. ఈ రోజు ప్రకటించిన సవరణల ప్రకారం లీటర్ పెట్రోల్‌పై ₹2.84 పెంపు, లీటర్ డీజిల్‌పై ₹2.86 పెంపు ఉంది. పెరిగిన ఈ భారీ ధరలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచే దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చేశాయి. దీంతో ఉదయాన్నే బంకులకు వెళ్లిన వాహనదారులకు రేట్లను చూసి ఫ్యూజులు అవుట్ అయ్యాయి.

ఒకేసారి ఐదు లేదా ఆరు రూపాయలు పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతోనే, చమురు సంస్థలు విడతల వారీగా రేట్లు పెంచుకుంటూ పోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత పది రోజుల్లోనే నాలుగు సార్లు రేట్లు మార్చడం దీనికి నిదర్శనం. ప్రతి రెండు, మూడు రోజులకు ఒకసారి పైసల్లో కాకుండా.. ఏకంగా రెండు రూపాయలకు పైగా పెంచేస్తూ పోతుండటంతో లీటర్ ఇంధనం ధరలు సరికొత్త రికార్డుల వైపు దూసుకుపోతున్నాయి. కేవలం పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వాహనదారులకే పరిమితం కాదు. దీని ప్రభావం చైన్ రియాక్షన్ లా అన్ని వర్గాలపై పడనుంది. రవాణా భారం పెరిగితే ఆటోమేటిక్‌గా మార్కెట్‌కు వచ్చే కూరగాయలు, పప్పులు, పాలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగక తప్పదు.