Reading Time: < 1 minute
Nandamuri Balakrishna Says Ap Will Be Developed As Capital For Telugu Film Industry

Nandamuri Balakrishna: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్ మరియు నాటక అభివృద్ధి సంస్థ (APFDC) కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీని తెలుగు సినీ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. “ఇది ఒక కొత్త అధ్యాయం ప్రారంభం” అని పేర్కొన్నారు. 1975లో ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రారంభమైందని, రాష్ట్ర విభజన తర్వాత రాజధానిలేని పరిస్థితుల్లో 2017లో ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తాను, ఇంకా మంత్రి కందుల దుర్గేష్ కలిసి సినీ రంగ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో చలనచిత్ర పరిశ్రమకు ఏపీ ఒక ముఖ్యమైన కేంద్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు సినిమాలకు వచ్చే కలెక్షన్లలో సుమారు 70% ఆదాయం ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తోందని బాలకృష్ణ తెలిపారు. తాను నటించిన ‘అఖండ’ సినిమా షూటింగ్‌ను రంపచోడవరంలో నిర్వహించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో అద్భుతమైన సహజ సిద్ధమైన లొకేషన్లు ఉన్నాయని చెప్పారు. “నేను చేసినన్ని సినిమాలు ఏపీలో మరెవ్వరూ చేసి ఉండరు” అంటూ వ్యాఖ్యానించారు.

సినిమా షూటింగ్‌లకు సంబంధించిన అన్ని అనుమతులు ఒకే చోట లభించేలా సింగిల్ విండో విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం షూటింగ్‌లు తగ్గిపోవడంతో సినీ రంగానికి చెందిన అనేక యూనియన్లు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నాయని బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. “సినిమా ఎలా ఉండాలో ఆలోచించే పరిస్థితి పోయి, పరిశ్రమను బ్రతికించాల్సిన పరిస్థితి వచ్చింది” అని అన్నారు.

టెక్నాలజీ రాకముందు సినిమాలు త్వరగా పూర్తయ్యేవని, ఇప్పుడు సాంకేతికత పెరిగినప్పటికీ నిర్మాణం ఆలస్యం అవుతోందని పేర్కొన్నారు. చాలామంది పంపిణీదారులు థియేటర్లకు తాళాలు వేసుకునే పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. జోడెడ్ల ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కట్టుబడి ఉంది. తెలంగాణ ప్రభుత్వ సహకారం కూడా కోరుతున్నాం. ఏపీలో తెలుగు చలనచిత్ర పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ అని బాలకృష్ణ అన్నారు. ఎక్కువ సినిమాలు నిర్మించి, థియేటర్లకు అందించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.