Reading Time: < 1 minute
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట

దేశ రాజధాని ఢిల్లీని ఆనుకుని ఉన్న ఐటీ హబ్ గుర్గావ్‌కు చెందిన ఒక జంట, నెలకు మూడు లక్షలు సంపాదిస్తున్నా.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో తాము పిల్లల్ని కనే సాహసం చేయలేమని తేల్చి చెప్పారు. పెరుగుతున్న జీవన వ్యయం నగరాల్లోని యువత ఆలోచనా విధానాన్ని ఎలా మారుస్తుందో ఈ ఉదంతం తెలియజేస్తోంది. గుర్గావ్‌లో నివసిస్తున్న 35 ఏళ్ల వ్యక్తి నెలకు రెండు లక్షల రూపాయలు సంపాదిస్తుండగా, అతని భార్య సంపాదన నెలకు లక్ష రూపాయలు. వీరిద్దరి వార్షిక ఆదాయం 36 లక్షల రూపాయలు. ఈ జీతం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. అయితే, పెరుగుతున్న జీవన వ్యయం, ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలు వారిని పిల్లలను కనకుండా అడ్డుకుంటున్నాయి. తమకంటూ గుర్గావ్‌లో వన్‌ బీహెచ్‌కే ఫ్లాట్ కొనే స్థోమత లేదు. అలాంటప్పుడు పుట్టబోయే బిడ్డకు తగినంత స్థలం ఎలా కల్పించగలం? అని ఆ జంట వాపోతోంది. దీనికి తోడు ప్రైవేట్ స్కూల్లో నెలకు కనీసం 35 వేల నుంచి 40 వేల రూపాయలు ఫీజుల రూపంలోనే చెల్లించాల్సి రావడం వారిని భయపెడుతోంది. రియల్ ఎస్టేట్ ధరలు, విద్యా ఖర్చుల భారం మోయలేకే వారు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ, పిల్లలు వద్దు అనుకునే వారిని ‘డింక్’ జంటలు అని అంటారు. ఆధునిక నగరాల్లో ఈ సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. నగరాల్లో సంతానోత్పత్తి రేటు ఎందుకు పడిపోతోందో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. భవిష్యత్తుకు ఆర్థిక భద్రత ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనకపోవడమే మంచిదని కొందరు సమర్థించారు. మరికొందరు మాత్రం వయసు దాడిపోయాక ఆ జంట బాధపడక తప్పదని రాసుకొచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా

పాదాల్లో వచ్చే ఈ మార్పులకు అర్థం ఏంటో తెలుసా ??