
IPL Business Model Explained: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పేరొందింది. ప్రపంచంలో ఎన్నో లీగ్లు ఉన్నా ఐపీఎల్ మాదిరి సక్సెస్ కాలేకపోయాయి. అలాంటి ఐపీఎల్లో విజయం సాధిస్తేనే లాభాలు వస్తాయని చాలా మంది భావిస్తారు. కానీ వాస్తవం మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఐపీఎల్లో ట్రోఫీ గెలవకపోయినా.. జట్లు భారీగా ఆదాయం పొందుతున్నాయి. ఆ లెక్కలు తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు.
నివేదికల ప్రకారం… ఐపీఎల్లో ప్రతి జట్టుకు సంవత్సరానికి రూ.480 కోట్లకు పైగా ఆదాయం కేంద్ర కాంట్రాక్ట్ ద్వారా వస్తుంది. ఈ మొత్తం ప్రధానంగా మీడియా హక్కుల ద్వారా వచ్చే భారీ ఆదాయం (సుమారు రూ.48,000 కోట్ల పూల్) నుంచి భాగస్వామ్యంగా అందుతుంది. ఈ డబ్బు అన్ని జట్లకు సమానంగా షేర్ అవుతుంది. ఖర్చుల విషయానికి వస్తే.. ప్లేయర్ సాలరీ సుమారు రూ.120 కోట్లు ఉంటుంది. మొత్తం నిర్వహణ ఖర్చులు కలిపి దాదాపు రూ.170 కోట్ల వరకు ఉంటాయి. ఆదాయం రూ.480 కోట్లు కాగా.. అందులో ఖర్చులు కేవలం రూ.170 కోట్లే. అంటే దాదాపుగా రూ.300 కోట్లు లాభం అన్నమాట.
ఒకవేళ ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీ సుమారు రూ.20 కోట్లు మాత్రమే. ఇది మొత్తం ఆదాయంలో కేవలం 4-5 శాతం మాత్రమే. అంటే అసలు ఆదాయం ట్రోఫీ గెలిస్తే రాదు. ఇతర వనరుల నుంచే ప్రాంచైజీలకు భారీగా ఆదాయం వస్తోంది. స్పాన్సర్షిప్లు, టికెట్ అమ్మకాలు, మెర్చండైజ్, వ్యూయర్షిప్ ద్వారా ఆదాయం వస్తుంది. బ్రాండ్లు ట్రోఫీల కోసం కాకుండా.. ప్రేక్షకుల దృష్టి కోసం డబ్బు పెట్టుబడి పెడతాయి. ప్రతి జట్టుకు 10కి పైగా స్పాన్సర్లు ఉంటారు.
పై లెక్కలు అన్ని చూస్తే.. ఐపీఎల్లో ఏ జట్టు కూడా నష్టాల్లోకి వెళ్లదు అని చెప్పొచ్చు. ప్రతి జట్టు వాల్యూ ఏడాదికి పెరుగుతూ ఉంటుంది. పంజాబ్ కింగ్స్ జట్టు గత 18 సంవత్సరాల్లో ఒక్క ట్రోఫీ కూడా గెలవకపోయినా.. దాని బ్రాండ్ వాల్యూ సుమారు రూ.9,000 కోట్లు. ఐపీఎల్లో ప్రతి జట్టుకు భారీగా ఆదాయం వస్తుందని చేపడనికి ఇదే ఓ చిన్న ఉదాహరణగా చెప్పొచ్చు. ఐపీఎల్లో విజయం మాత్రమే కాదు.. వ్యాపార వ్యూహం కూడా కీలకం. ట్రోఫీ గెలవకపోయినా..సరైన బ్రాండింగ్, ప్రేక్షకుల ఆదరణతో జట్లు భారీ లాభాలు ఆర్జిస్తున్నాయి.