Reading Time: < 1 minute
Iranian Coast Guard Attacks Indian Crew Mt Siron Oman Coast Incident

Iranian Attack Indian Crew: ఒమన్‌ తీరంలో ప్రయాణిస్తున్న ఒక కెమికల్ ట్యాంకర్‌పై ఇరాన్ కోస్ట్ గార్డ్ దళాలు దాడికి దిగాయి. ఈ నౌకలో 12 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు కేంద్ర ఓడరేవుల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఏప్రిల్ 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే.. టోగో (Togo) దేశ జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంటీ సిరాన్’ (MT Siron) అనే కెమికల్ ట్యాంకర్ ఒమన్‌లోని షినాస్ పోర్ట్ పరిమితికి సమీపంలో ఇతర నౌకలతో కలిసి వెళ్తోంది. ఆ సమయంలో ఇరాన్ కోస్ట్ గార్డ్ ఒక్కసారిగా హెచ్చరిక కాల్పులు జరిపింది. ఈ దాడిలో నౌకలోని భారతీయ సిబ్బంది ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

భారత ప్రభుత్వం స్పందన..
ఈ ఘటనపై కేంద్ర ఓడరేవుల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ మన్‌దీప్ సింగ్ రంధవా సోమవారం విలేకరులతో మాట్లాడారు. “ఏప్రిల్ 25న ఎంటీ సిరాన్ నౌకపై దాడి జరిగింది. ఈ నౌకలో భారతీయ సిబ్బంది ఉన్నట్లు సమాచారం అందింది. ప్రస్తుతం సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని” ఆయన తెలిపారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA), భారత రాయబార కార్యాలయాలు, ఇతర ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సముద్ర ప్రయాణాల్లో భారతీయ నావికుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రంధవా స్పష్టం చేశారు. నిజానికి ఇరాన్ దళాలు భారతీయ నౌకలపై ఇలా దాడులు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ రెండు భారతీయ నౌకలపై దాడులు చేశాయి. వీఎల్‌సీసీ సన్మార్ హెరాల్డ్, జగ్ అర్నవ్ నౌకలు ‘హార్ముజ్ జలసంధి’ దాటుతున్న సమయంలో ఇరాన్ దళాలు కాల్పులు జరిపాయి. ఈ వరుస ఘటనలపై భారత ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఒమన్ తీరంలో జరిగిన తాజా ఘటనతో పశ్చిమాసియా సముద్ర జలాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.