July 17, 2026

Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్‌లైన్స్‌లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక

Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్‌లైన్స్‌లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
Reading Time: 2 minutes
Cm Chandrababu Warns Tdp Leaders Over Misconduct Ahead Of Local Elections

Chandrababu warning: తెలుగుదేశం పార్టీ నూతన కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పార్టీ నేతలకు ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. గతంతో పోలిస్తే ఈసారి మరింత కఠినంగా మాట్లాడిన చంద్రబాబు, పార్టీ ప్రతిష్ట దెబ్బతినేలా ఎవ్వరూ ప్రవర్తించొద్దని హెచ్చరించారు. తప్పులు చేస్తే నేరుగా హెడ్‌లైన్స్‌లోకి వెళ్తారని, అలాంటి పరిస్థితులు రానీయకుండా జాగ్రత్తగా ఉండాలని నేతలకు సూచించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రతి నాయకుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఇష్టం వచ్చినట్టు పని చేసి పార్టీకి చెడ్డపేరు తేవద్దని గట్టిగా చెప్పారు.

నాలుగు దశాబ్దాలుగా పార్టీ కమిటీలపై కసరత్తు చేస్తున్నానని, అయితే ఈ స్థాయిలో సమగ్రంగా పరిశీలించి కమిటీలు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి అని చంద్రబాబు తెలిపారు. ఎన్నో వడపోతలు, వ్యూహాలతో నూతన కమిటీలను రూపొందించామని చెప్పారు చంద్రబాబు.. సీనియర్లకు గౌరవం ఇస్తూనే కొత్తవారికి అవకాశాలు కల్పించామని, కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇచ్చామని వెల్లడించారు. కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని మాటల్లో కాకుండా ఆచరణలో చూపిస్తున్నామని అన్నారు. మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని, మహిళా బిల్లుకు పూర్తిగా మద్దతు తెలిపామని చెప్పారు. చదువుకున్న వారికి మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ఓ మండల పార్టీ అధ్యక్షురాలికి, క్లస్టర్ ఇన్‌చార్జికి పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించడం ఇందుకు నిదర్శనమని అన్నారు.

ఇక, నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కీలక పాత్ర పోషించారని చంద్రబాబు కొనియాడారు. కార్యకర్తల శిక్షణ, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. రాష్ట్రానికి 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావాలనే లక్ష్యంతో లోకేష్ కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ బలం పెరగాలని, గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లకంటే ఎక్కువ ఓట్లు సాధించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు గతంలో ఎదుర్కొన్న కష్టాలు తనకు గుర్తున్నాయని, వారి కష్టఫలితంగానే పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిందని అన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ కేంద్ర సహకారంతో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. నిలిచిపోయిన కేంద్ర పథకాలను పునరుద్ధరించామని, అప్పులను రీషెడ్యూల్ చేస్తున్నామని చెప్పారు. సూపర్ సిక్స్ హామీల అమలు, పెన్షన్ల పంపిణీ, ప్రజలకు వాట్సాప్ సేవలు అందిస్తున్నామని వివరించారు. ప్రత్యర్థి పార్టీలపై కూడా చంద్రబాబు విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేశారని, ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఫేక్ ప్రచారాలకు ఇక కాలం చెల్లిందని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ప్రజలు మీపై ఓ కన్నేసి పెట్టారు.. మీరు ఎవరిని కలుస్తున్నారో గమనిస్తున్నారు.. అధికారం ఉందని ఇగోకు పోతే మీరే నష్టపోతారు అని హెచ్చరించారు… ఫ్లెక్సీల దగ్గర గొడవపడుతున్నారు.. కార్యకర్తలు తప్పుచేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది.. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు నన్ను బాధపెట్టాయి అన్నారు.. ఎన్డీఏలో ఉన్నాం, మన ఉనికి కాపాడుకోవాలి.. ఐకమత్యం కాపాడాలి అని సూచించారు.. కేంద్రానికి, రాష్ట్రానికి చెడ్డపేరు రాకుండా పనిచేస్తున్నాం.. ఈ స్ఫూర్తి గ్రామం వరకు కొనసాగాలని స్పష్టం చేశారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు..