
Rs 397 Crore Transformer Scam: తమిళనాడులో ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు వ్యవహారంలో భారీ అవినీతి ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కేసులో మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రూ.397 కోట్ల మేర ప్రజాధనం వృథా అయిందనే ఆరోపణలపై సీబీఐ విచారణకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2021 నుంచి 2023 మధ్య కాలంలో తమిళనాడు విద్యుత్ సంస్థ టాంజెడ్కో కోసం 45,800 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు జరిగింది. ఈ టెండర్ల ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా కొందరు కాంట్రాక్టర్లు సిండికేట్గా ఏర్పడి టెండర్లు దక్కించుకున్నారని ఫిర్యాదులు నమోదయ్యాయి.
Read Also: Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
ప్రత్యేకంగా 26 కంపెనీలు ఒకే ధర కోట్ చేయడం అనుమానాలకు తావిచ్చింది. ఇది ముందస్తు కుట్రలో భాగమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్ ప్రక్రియలో పోటీ లేకుండా పరస్పర అవగాహనతో కాంట్రాక్టులు పొందినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై అరప్పోర్ ఇయక్కమ్ సంస్థ ఫిర్యాదు చేయడంతో కేసు న్యాయస్థానం దృష్టికి వెళ్లింది. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పరిశీలించిన మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ సీరియస్గా స్పందించింది. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరపాలని ఆదేశించింది.
ఈ కేసులో మాజీ మంత్రి సెంథిల్ బాలాజీతో పాటు అప్పటి ఉన్నతాధికారుల పాత్రపై కూడా దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. టెండర్ల కేటాయింపు, ధరల నిర్ణయం, నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలపై సీబీఐ లోతుగా విచారణ చేపట్టనుంది.. ఈ కేసు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ప్రజాధనం దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు తీవ్రంగా మారడంతో సీబీఐ దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.