
Fuel Shortage: రాష్ట్రంలో ఇంధన సరఫరా పరిస్థితులపై ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పెట్రోల్, డీజిల్ సరఫరా, నిల్వలు, ఫిర్యాదులపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల కమిషనర్ కన్నబాబు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో కొంతమంది పెట్రోల్ బంకులు నిల్వలు ఉన్నప్పటికీ లేవని చెబుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. అలాంటి బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బల్క్గా డీజిల్, పెట్రోల్ను పక్కదోవ పట్టిస్తే సహించబోమని స్పష్టం చేశారు.
Read Also: AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు పెట్రోల్ బంకులపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని వెల్లడించారు. జిల్లా వారీగా వచ్చిన నివేదికలను పరిశీలించి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా డ్రై అవుట్ పరిస్థితులు తగ్గుముఖం పట్టాయని, ఆయిల్ కంపెనీల నుంచి డిస్పాచ్లు వేగవంతం అయ్యాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం అమలు చేస్తున్న రేషన్ విధానం మంచి ఫలితాలు ఇస్తోందని, పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అదే విధానం కొనసాగుతుందని చెప్పారు.
రైతులకు ఎలాంటి ఇంధన కొరత రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు నాదెండ్ల.. ముఖ్యంగా ఆక్వా రైతులు, రబీ పంట కోతల కోసం అవసరమైన డీజిల్ సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేస్తున్న వారిపై కూడా నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఇంధన పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరే వరకు నిరంతర సమీక్ష కొనసాగిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు లేకుండా సరఫరా వ్యవస్థను పటిష్టంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.