Reading Time: < 1 minute
Andhra: ట్రాన్స్‌జెండర్‌కి పిఏ ఉద్యోగం ఇచ్చిన ఎమ్మెల్యే.. మంత్రి నారా లోకేష్ ఏమన్నారంటే..

ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి తన నియోజకవర్గ పరిధిలో ప్రతి మంగళవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. గత వారంలో జరిగిన కార్యక్రమాన్ని ట్రాన్స్ జెండర్స్ అసోసియేషన్ నేతలు.. కొంతమంది ట్రాన్స్ జెండర్స్ తో కలిసి ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చారు. తమకు ఇళ్ల పట్టాలు ఇప్పించాలని ఎమ్మెల్యే మాధవికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే వారితో వచ్చిన వర్షిణిని ఎమ్మెల్యే పలకరించారు. ఏం చదువుకున్నావంటూ అడిగారు. బికామ్ చేశానంటూ వర్షిణి చెప్పింది. అయితే ఏదైనా పనిచేసుకోవచ్చు కదా భిక్షాటన ఎందుకంటూ ఎమ్మెల్యే మాధవి.. వర్షిణిని ప్రశ్నించారు. మాకు ఉద్యోగం ఎవరూ ఇస్తారు మేడమ్.. ఎవరూ ఇవ్వరు. దీంతో తప్పనిసరిగా భిక్షాటన చేయాల్సి వస్తుందని ట్రాన్స్ జెండర్ వర్షిణి చెప్పింది.

వెంటనే ఎమ్మెల్యే… ఉద్యోగం ఇస్తాను చేస్తావా అంటూ అడిగారు. నెలకు పదిహేను వేలు జీతం కూడా ఇస్తాను. పీఏ (పర్సనల్ అసిస్టెంట్) గా పనిచేయాలని చెప్పారు. దానికి వర్షిణి భిక్షాటన ద్వారానే నెలకు ముప్పై వేల వరకూ వస్తున్నట్లు వర్షిణి చెప్పింది. దీంతో ఎమ్మెల్యే వెంటనే 25 రూపాయల జీతం ఇస్తాను. పిఏ గా చేయాలంటూ చెప్పారు. ఇక అప్పటి నుండి వర్షిణి రంగంలోకి దిగింది. ఎమ్మెల్యే వెంటే ఉంటూ పార్టీ కార్యక్రమాల షెడ్యూల్ చూస్తుంది.

ఎమ్మెల్యే ట్రాన్స్ జెండర్ ను ఏకంగా తన పిఏగా నియమించుకోవడంతో అందరూ ప్రశంసిస్తున్నారు. మంత్రి లోకేష్.. ఎమ్మెల్యేను ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్యేను పొలిట్‌బ్యూరో లో తీసుకున్న తర్వాత ఆమె చేసిన పని అందరి నుండి ప్రశంసలు అందుకుంటుంది. గతంలోనూ గ్రీవెన్స్ సమయంలో ఒక మహిళ ఫోన్ చేసి.. ఆకతాయిలు మద్యం సేవించి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పిన వెంటనే ఎమ్మెల్యే బైక్ పై ఆ ప్రాంతానికి వెళ్లి పోలీసులకు ఆదేశాలిచ్చారు. ఇలా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి చేస్తున్న కార్యక్రమాలు అటు ప్రజలు, ఇటు నేతల ప్రశంసలు అందుకుంటున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..