
మీ ఇంట్లో ఉన్న మొక్కలకు పుష్కలంగా పూలు పూయాలంటే, కొన్ని సాధారణ గార్డెనింగ్ చిట్కాలను పాటించడం ఎంతో ప్రయోజనకరం. ఈ చిట్కాలు మల్లెపూలు, గులాబీలు వంటి పూల మొక్కలకే కాకుండా పండ్ల మొక్కలకు కూడా వర్తిస్తాయి.. వాటి ఎదుగుదలకు, అధిక దిగుబడికి దోహదపడతాయి. నిపుణులు సూచించినట్లు.. ఈ కథనంలో వివరించిన పద్ధతులను అనుసరించడం ద్వారా మీరు అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.. ముఖ్యంగా.. మల్లె పూల మొక్కలు విరగబూయాలంటే కొన్ని సాధారణ చిట్కాలు పాటించడం ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చు. మల్లె మొక్కలకు అధిక పూత, పూలు రావాలంటే ఏం చేయాలో చూద్దాం..
ప్రూనింగ్ తప్పనిసరి..
మల్లె మొక్కలు గుత్తులు గుత్తులుగా, విరగ పూయాలంటే క్రమం తప్పకుండా కత్తిరింపు, ఎండ, సహజ ఎరువులు అవసరం.. పూత సీజన్ ముగిశాక కొమ్మలను కత్తిరించడం, నెలకోసారి ఆర్గానిక్ ఎరువులు వేయడం ద్వారా ఎక్కువ పూలు పూస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే.. సహాజ ఎరువును ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
మొదటి.. ముఖ్యమైన చిట్కా, ఇంటిలో తయారుచేసుకునే ఒక శక్తివంతమైన ద్రవ ఎరువును ఉపయోగించడం. దీనికి కావలసింది పల్చటి మజ్జిగ – ఆవాల పొడి. ఒక లీటరు పల్చటి మజ్జిగకు రెండు టీస్పూన్ల ఆవాల పొడిని చేర్చి, ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఆవాల పొడి మజ్జిగలో చక్కగా కలిసిన తర్వాత, ఈ ద్రావణాన్ని కనీసం రెండు గంటల పాటు పక్కన ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆవాలలో ఉండే పోషకాలు మజ్జిగలోకి చేరి, మొక్కలకు మరింత అందుబాటులోకి వస్తాయి.
తయారైన ఈ ద్రావణాన్ని మొక్కలకు ఎలా ఇవ్వాలంటే..
మల్లె పూల మొక్కలకు ఒక చిన్న గ్లాసు చొప్పున వారానికి ఒకసారి ఇవ్వడం సరిపోతుంది. ఇది మొక్కల పెరుగుదలను ప్రోత్సహించి, వాటిని బలంగా తయారు చేస్తుంది, తద్వారా పూలు విరగబూస్తాయి. పండ్ల మొక్కలకు అయితే, ఈ మిశ్రమాన్ని ఒక మగ్గు చొప్పున నాలుగైదు రోజులకు ఒకసారి ఇవ్వాలి. ఈ చిట్కా గులాబీ, మల్లెపువ్వు వంటి ఏ రకమైన పూల మొక్కలకైనా, అలాగే పండ్ల మొక్కలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ద్రావణం మొక్కలకు అవసరమైన సూక్ష్మపోషకాలను అందించి, వాటిలో పుష్పించే శక్తిని పెంచుతుంది.
రెండవ ముఖ్యమైన చిట్కా ఏమిటంటే
మొక్కల మొదళ్లలో మట్టిని ఎప్పుడూ గట్టిగా ఉండనివ్వకుండా జాగ్రత్త పడాలి. మట్టిని వదులుగా ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. వదులైన మట్టిలో మొక్కలకు మనం ఇచ్చే పోషకాలు సులభంగా అందుతాయి. గాలి కూడా మొక్కల వేర్లకు బాగా అందుతుంది.. ఇది వేర్ల ఆరోగ్యానికి, మొక్క మొత్తం పెరుగుదలకు అత్యవసరం. మట్టి గట్టిగా ఉంటే పోషకాలు లోపలికి వెళ్లడం కష్టం అవుతుంది.. గాలి కూడా సరిగా అందదు, ఇది మొక్కల పెరుగుదలను అడ్డుకుంటుంది. కాబట్టి, ఎప్పటికప్పుడు మొక్కల మొదళ్లలోని మట్టిని పదునైన పనిముట్టుతో వదులు చేస్తూ ఉండాలి.
ఈ రెండు సులభమైన చిట్కాలను మీ గార్డెనింగ్లో భాగం చేసుకుంటే, మీ మొక్కలు ఆరోగ్యంగా ఉండి, పుష్కలంగా పూలు పూస్తాయి. ఈ పద్ధతులు ఇంటి పెరటి తోటలకు చాలా అనుకూలమైనవి, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి.
ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా మీ ఇంట్లో ఈ చిట్కాలను ప్రయోగించి, ఫలితాలను పొందండి..
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..