Reading Time: < 1 minute
Telangana Petrol Shortage Fuel Rationing Rules Hyderabad

గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ సరఫరాకు సంబంధించి గందరగోళం నెలకొంది. ఇంధన నిల్వలు నిండుకుంటున్నాయనే వార్తల నేపథ్యంలో వాహనదారులు బంకుల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ రద్దీని నియంత్రించడానికి , అందుబాటులో ఉన్న నిల్వలను అందరికీ సమానంగా పంపిణీ చేయడానికి పెట్రోల్ బంకుల యాజమాన్యాలు కొన్ని కఠినమైన నిబంధనలను అమలులోకి తీసుకువచ్చాయి.

పెట్రోల్ బంకుల్లో ఇంధన లభ్యత తక్కువగా ఉండటంతో, యాజమాన్యాలు వాహనాల రకాన్ని బట్టి రేషన్ పద్ధతిని అమలు చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాలు.. బైక్‌లు లేదా స్కూటర్లకు కేవలం రూ. 200 విలువైన పెట్రోల్‌ను మాత్రమే పోస్తున్నారు. నాలుగు చక్రాల వాహనాలకు గరిష్టంగా రూ. 1,000 వరకు మాత్రమే ఇంధనాన్ని నింపుతున్నారు. ప్లాస్టిక్ బాటిళ్లు, పెద్ద డబ్బాలు లేదా క్యాన్లలో పెట్రోల్ నింపడాన్ని పూర్తిగా నిషేధించారు. అత్యవసర పరిస్థితుల పేరుతో వచ్చే వారికి కూడా ఇంధనం నింపే ప్రసక్తే లేదని బంకు యజమానులు ఖరాఖండిగా చెబుతున్నారు.

మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇంధన కొరతపై స్పందిస్తూ ప్రజలు ఆందోళన చెందవద్దని కోరుతున్నారు. రాష్ట్రంలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని, ఇది కేవలం “కృత్రిమ కొరత” మాత్రమేనని వారు పేర్కొంటున్నారు. పెట్రోల్ నిల్వలను దాచిపెట్టి, బ్లాక్ మార్కెట్‌లో విక్రయించే వారిపై లేదా కావాలనే కొరత సృష్టించే బంకు యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అగ్ని ప్రమాదాల దృష్ట్యా దుర్వినియోగాన్ని అరికట్టడానికి బాటిళ్లలో పెట్రోల్ విక్రయించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల వల్ల వాహనదారులు ఒకేసారి బంకుల వద్దకు రావడంతో “ప్యానిక్ బయింగ్” (భయంతో కొనుగోలు చేయడం) జరుగుతోంది. దీనివల్ల సాధారణంగా ఉండాల్సిన నిల్వలు కూడా వేగంగా ఖర్చయిపోతున్నాయి. అధికారులు సరఫరాను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నందున, ప్రజలు సంయమనం పాటించాలని .. అవసరమైన మేరకే ఇంధనాన్ని నింపుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఆంక్షలు తాత్కాలికమే అయినప్పటికీ, పరిస్థితి చక్కబడే వరకు వాహనదారులు సహకరించడం అవసరం.