July 17, 2026

Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్‌కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!

Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్‌కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
Reading Time: < 1 minute
Afghanistan Oil Extraction Amu Darya Basin India Cheaper Fuel Prospects

Afghanistan: ఇరాన్ – ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్న తరుణంలో ఆఫ్ఘనిస్థాన్‌కి వేల కోట్ల నిధి దొరికింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని ఉత్తర జౌజ్జాన్ ప్రావిన్స్‌లోని అము దర్యా బేసిన్‌లో గల జమ్రాద్ సాయి ప్రాంతంలో ఐదు బావుల నుంచి చమురు వెలికితీతను ప్రారంభించినట్లు ఆఫ్ఘన్ గనులు, పెట్రోలియం మంత్రిత్వ శాఖ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. గత మూడు సంవత్సరాలుగా ఆఫ్ఘన్ ఇంజినీర్లు నిరంతరం శ్రమించి నిర్వహించిన భూగర్భ సర్వేలు, డ్రిల్లింగ్ పనులు ఎట్టకేలకు ఫలించాయి. ఇక్కడి 12 బావుల్లో ప్రస్తుతం 5 బావుల నుంచి పైలట్ ఉత్పత్తి మొదలైంది. ప్రస్తుతం ఇవి రోజుకు సుమారు 500 క్యూబిక్ మీటర్ల చమురును ఉత్పత్తి చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఉత్పత్తిని భారీగా పెంచేందుకు తాలిబన్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

భారతదేశానికి భారీ ప్రయోజనం..
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాల వల్ల హోర్ముజ్ జలసంధి మూతపడి, ప్రపంచ చమురు వాణిజ్యంలో 20 శాతం నిలిచిపోతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చమురు కోసం భారత్ ఆఫ్రికా దేశాల వైపు చూస్తోంది. అయితే ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్‌కు ఉన్న చారిత్రక సంబంధాల దృష్ట్యా, అక్కడ చమురు ఉత్పత్తి పెరిగితే అది మన దేశానికి పెద్ద వరం కానుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఆఫ్ఘన్ నుంచి చమురు దిగుమతి భారత్‌కు చౌకగా మారే అవకాశం ఉంది. భౌగోళికంగా దగ్గరగా ఉండటం వల్ల రవాణా వ్యయం, సమయం భారీగా తగ్గుతాయి. ఆఫ్ఘన్ చమురు నిల్వలను వెలికితీయడంలో చైనా కీలక పాత్ర పోషిస్తోంది. 2023లో జిన్‌జియాంగ్ సెంట్రల్ ఆసియా పెట్రోలియం అండ్ గ్యాస్ కంపెనీ (CAPEIC)తో తాలిబన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు మూడేళ్ల కృషి తర్వాత ఇప్పుడు చమురు ఉత్పత్తి ప్రారంభం కావడం ఆఫ్ఘనిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోసినట్లయింది. దశాబ్దాల కాలంగా యుద్ధాలు, అస్థిరతతో సతమతమవుతున్న ఆఫ్ఘనిస్థాన్.. ఇప్పుడు ఖనిజాలు, చమురు ఎగుమతుల ద్వారా తిరిగి కోలుకోవాలని భావిస్తోంది. అదే జరిగితే దక్షిణాసియాలో చమురు రాజకీయాలు కొత్త మలుపు తిరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.