
Yashasvi Jaiswal: ఐపీఎల్లో రాజస్థాన్ యువ బ్యాటర్ వైభవ్ సూర్య వంశీ సంచలనం సృష్టిస్తున్నాడు. నిన్న పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 16 బంతుల్లోనే 43 పరుగులు సాధించి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. ఈ ఎన్నింగ్స్పై రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ స్పందించాడు. తన తోటి ఓపెనర్, 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన భారీ లక్ష్య ఛేదనలో వీరిద్దరి భాగస్వామ్యంపై జైస్వాల్ తన అనుభవాలను పంచుకున్నాడు. సూర్యవంశీ బ్యాటింగ్ గురించి చెబుతూ.. “వైభవ్తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా అద్భుతంగా ఉంది. అతను బంతిని హిట్ చేస్తున్న తీరు చూస్తుంటే నాన్-స్ట్రైకర్ ఎండ్లో ఉన్న నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నిజానికి నేను కూడా చాలా చిన్నవాడినే, కానీ అతనితో పోలిస్తే నేను పెద్దవాడిని అంటే ఏమని చెప్పాలో అర్థం కావడం లేదు. అతనిలో ఉన్న ప్రతిభ అసాధారణం” అని జైస్వాల్ అన్నాడు.
భారీ లక్ష్య ఛేదన కోసం తమ ప్రణాళికను వివరిస్తూ.. “ఇది హై-స్కోరింగ్ గ్రౌండ్ అని మాకు తెలుసు. అందుకే ఆరంభం నుండే దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నాం. బంతులను అస్సలు వదలకూడదనే స్పష్టమైన ఆలోచనతో బరిలోకి దిగాం. 200 పైచిలుకు పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు ఆ ‘ఇంటెంట్’ చాలా ముఖ్యం” అని పేర్కొన్నాడు. జట్టులోని మార్పులు, వాతావరణం గురించి స్పందించాడు. అందరూ ప్రతి మ్యాచ్లో రాణించాలేరని తెలిపాడు. కానీ తమ జట్టులో ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉందని చెప్పాడు. తామంతా ప్రాసెస్పైనే దృష్టి పెడుతున్నామని.. సరైన సమయంలో ఫలితాలు వస్తాయని తమకు తెలుసని ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణం చాలా సరదాగా ఉందని.. మేమంతా కలిసి ఈ ఆటను ఆస్వాదిస్తున్నామన్నాడు. ఒకరికొకరు అండగా నిలుస్తూ, స్వేచ్ఛగా ఆడటమే తమ జట్టు విజయరహస్యమని వివరించాడు.