Reading Time: 2 minutes
పోలీసులు చూస్తుండగానే.. ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన బాధితులు.. ఎందుకో తెలుసా?

గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలో జరిగిన ఒక దురదృష్టకర సంఘటన ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఝగాడియా జీఐడీసీలోని ‘మెట్రోపాలిటన్ ఎగ్జెక్మ్’ అనే రసాయన కర్మాగారంలో ఏప్రిల్ 23న భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 16 మంది కార్మికులు తీవ్రంగా గాయపడగా, చికిత్స పొందుతూ రాకేష్ వాసవతో సహా ఇద్దరు కార్మికులు మరణించారు.

మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే విషయంలో కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరుగుతున్న సమయంలో, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యే చైతర్ వాసవ తన మద్దతుదారులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. బాధితులకు భారీ పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, ఈ క్రమంలో మృతుడి బంధువు రోషన్ వాసవకు, ఎమ్మెల్యేకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి తీవ్రరూపం దాల్చి, చైతర్ వాసవ, మృతుల కుటుంబ సభ్యులలో ఒకరు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఫ్యాక్టరీ గేటు వద్ద పోలీసుల సమక్షంలోనే ఎమ్మెల్యే చైతర్ వాసవ ఒక్కసారిగా రోషన్‌ను చెంపదెబ్బ కొట్టారు. దీనికి ప్రతిగా రోషన్ కూడా ఎమ్మెల్యేపై చేయి చేసుకున్నారు. అక్కడున్న వారు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీయాల్సి వచ్చింది. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

ఘటన అనంతరం రోషన్ వాసవ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే సమాజానికి సహాయం చేయడానికి కాకుండా, కంపెనీ నుండి డబ్బు వసూలు చేయడానికి వచ్చారని ఆరోపించారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదని, కేవలం తన కుటుంబ న్యాయం కోసం పోరాడుతున్నానని స్పష్టం చేశారు. అక్కడ శాంతిభద్రతల సమస్య తలెత్తితే దానికి చైతర్ వాసవదే బాధ్యతని రోషన్ పేర్కొన్నారు.

ఈ ఆరోపణలను ఎమ్మెల్యే చైతర్ వాసవ కొట్టిపారేశారు. బాధితుల కుటుంబాలే న్యాయం కోసం తనను ఆశ్రయించాయని, అందుకే తాను అక్కడికి వెళ్లానని ఆయన సమర్థించుకున్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయలేదు. మరోవైపు, ఒక ప్రజా ప్రతినిధి బాధితుడి కుటుంబ సభ్యుడిపైనే చేయి చేసుకోవడం పట్ల ప్రజల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..