Reading Time: < 1 minute
Google Data Center Foundation Stone Laid In Visakhapatnam By Cm Chandrababu

Google Data Center: ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను తీసుకురావాలన్న లక్ష్యంతో మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నం జిల్లా తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్‌కు ఘనంగా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. గూగుల్ క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, గూగుల్ గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & క్లౌడ్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా విశాఖ నగరం అంతర్జాతీయ స్థాయిలో టెక్నాలజీ హబ్‌గా ఎదగనుందని ప్రభుత్వం భావిస్తోంది.

Read Also: PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్‌బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్

ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్, భారతీ ఎంటర్‌ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ మిట్టల్, అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ జీత్ అదానీ, గూగుల్ ఇండియా ప్రతినిధి ప్రీతి లోబానా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి ముందు సీఎం చంద్రబాబు గూగుల్ ఎక్స్‌పీరియన్స్ జోన్‌ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన సాంకేతిక నమూనాలను పరిశీలించారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు.

అదానీ కనెక్స్, ఎయిర్‌టెల్ నెక్స్‌ట్రా భాగస్వామ్యంతో గూగుల్ ఈ ప్రాజెక్ట్‌ను చేపడుతోంది. సుమారు 15 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడితో ఈ క్లౌడ్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విశాఖ జిల్లా తర్లువాడలో 1 గిగావాట్ సామర్థ్యంతో హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణం జరగనుంది. అదేవిధంగా తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌ల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 600 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్ట్‌తో వేలాది ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటు విశాఖపట్నం దేశంలోనే ప్రముఖ డేటా, క్లౌడ్, ఏఐ హబ్‌గా అవతరించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.