Reading Time: < 1 minute
Karimnagar Sri Chaitanya College Robbery Accused Yugender Arrested

జల్సాలకు అలవాటు పడి, కష్టపడకుండా అక్రమంగా డబ్బు సంపాదించాలనే దురాశతో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు బొద్దుల యుగేందర్‌ను కరీంనగర్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి దొంగిలించిన రూ. 5 లక్షల నగదు, 10 గ్రాముల బంగారు గొలుసును పోలీసులు రికవరీ చేశారు. కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ఈ కేసు వివరాలను వెల్లడించారు. టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె. సృజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దుర్షెడ్ గ్రామానికి చెందిన బొద్దుల యుగేందర్ (32) అనే వ్యక్తి వృత్తిరీత్యా నేరస్తుడు. ఇతనిపై గతంలోనూ అనేక దొంగతనాల కేసులు ఉన్నాయి. నేర ప్రవృత్తి కారణంగా గతంలో ఇతనిపై పీడీ యాక్ట్ (PD Act) నమోదు చేసి జైలుకు పంపారు. అయితే.. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా యుగేందర్ తన పద్ధతి మార్చుకోలేదు.

ఏప్రిల్ 26వ తేదీ తెల్లవారుజామున మంకమ్మతోటలోని శ్రీ చైతన్య కాలేజీ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు. ఆఫీసు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి, బీరువాలో ఉన్న రూ. 5 లక్షల నగదును, ఒక బంగారు చైన్‌ను ఎత్తుకెళ్లాడు. దొంగిలించిన సొత్తును ఎవరికీ అనుమానం రాకుండా తన ఇంటి వెనుక ఉన్న కట్టెల కుప్పలో దాచిపెట్టాడు.

కాలేజీలో దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు, సాంకేతిక ఆధారాలు, నమ్మదగిన సమాచారంతో నిందితుడిని దుర్షెడ్ గ్రామంలోని అతని నివాసం వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించడమే కాకుండా.. గతంలో చింతకుంట ఆంజనేయస్వామి గుడిలో హుండీ దొంగతనం చేసినట్లు కూడా ఒప్పుకున్నాడు. పోలీసులు నిందితుడు దాచిన చోటు నుంచి రూ. 5 లక్షల నగదును, 10 గ్రాముల బంగారు చైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నేరస్థులపై నిరంతరం నిఘా ఉంటుందని, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి హెచ్చరించారు. తక్కువ సమయంలో కేసును ఛేదించి సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసు బృందాన్ని సీపీ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు.