Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!

Heatwave Alert : తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. భానుడి ప్రతాపానికి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతుండటంతో జనం విలవిలలాడుతున్నారు. తాజాగా ఆదిలాబాద్లో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ఈ సీజన్లోనే అత్యంత వేడి రోజుగా నిలిచింది. అయితే రాబోయే రెండు రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోందని, ఉష్ణోగ్రతలు ఏకంగా 47 డిగ్రీల మార్కును తాకే ప్రమాదం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అసాధారణంగా పెరుగుతున్న ఈ వేడిని పరిగణనలోకి తీసుకున్న ఐఎండీ, రాష్ట్రవ్యాప్తంగా హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కొమరంభీమ్, నిర్మల్, జగిత్యాల మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలకు అత్యంత ప్రమాదకరమైన ‘రెడ్ అలర్ట్’ ప్రకటించింది. ఈ జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఒకవైపు ఎండలు మండిపోతున్నప్పటికీ, స్థానికంగా ఏర్పడిన వాతావరణ మార్పుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ వర్షాలు వేడి నుంచి కొంత ఉపశమనం కలిగిస్తాయని ప్రజలు ఆశించినప్పటికీ, రాబోయే 48 గంటలు మాత్రం రాష్ట్రానికి అత్యంత కీలకం కానున్నాయి. ప్రజలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది.