
Riyan Parag: నిన్న (మంగళవారం) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు పంజాబ్ కింగ్స్పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి నాలుగు బంతులు మిగిలి ఉండగానే 223 లక్ష్యాన్ని ఛేదించింది రాజస్థాన్. న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఇక పంజాబ్ కింగ్స్పై సాధించిన భారీ విజయం అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తన జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. టోర్నీ ప్రారంభానికి ముందే తాము ఆటను కేవలం ఒక ఆటలాగే చూడాలని నిర్ణయించుకున్నామని, గెలిచినా ఓడినా అందులోని తప్పొప్పులను సమీక్షించుకుని ముందుకు సాగడమే తమ పని అని పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్ ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. “ఇది దాదాపు మా అత్యుత్తమ ప్రదర్శన అని చెప్పవచ్చు. బౌలింగ్లో వారిని ఇంకాస్త తక్కువ స్కోరుకే పరిమితం చేయాల్సి ఉండేది. అలాగే మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ ఇంకా మెరుగ్గా ఉండాల్సింది. ఒక మ్యాచ్లో మొత్తం 40 ఓవర్ల పాటు ఖచ్చితత్వంతో ఆడటం అసాధ్యం, కానీ ఆ దిశగా ప్రయత్నించడమే మా లక్ష్యం. ఇక, మిడిల్ ఆర్డర్ గురించి ఆందోళనలు కేవలం బయట వ్యక్తులకు, వ్యాఖ్యాతలకు మాత్రమే ఉన్నాయి. మాకు కాదు. మా ఆటగాళ్ల సామర్థ్యంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎప్పుడైనా మిడిల్ ఆర్డర్ విఫలమైతే ఓపెనర్లు లేదా లోయర్ ఆర్డర్ బాధ్యత తీసుకుంటారు. అలాగే టాప్ ఆర్డర్ ఆడనప్పుడు మిడిల్ ఆర్డర్ ఆదుకుంటుంది. బయట జరిగే చర్చలను మేం పట్టించుకోం” అని స్పష్టం చేశాడు. లక్ష్య ఛేదనలో తమ వ్యూహాన్ని వివరిస్తూ.. “వికెట్లు చేజార్చుకోకుండానే రన్ రేట్ తగ్గకుండా చూడాలనుకున్నాం. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ఇచ్చిన ఆరంభం మా పనిని చాలా సులభం చేసింది. పవర్ప్లే తర్వాత రన్ రేట్ కాస్త తగ్గినప్పటికీ, చివర్లో శుభమ్ దూబే, డోనోవన్ ఫెరీరా అద్భుతమైన భాగస్వామ్యంతో మ్యాచ్ను పంజాబ్ నుంచి లాగేసుకున్నారు. వారిద్దరూ ఆడిన తీరు నిజంగా ప్రశంసనీయం” అని కెప్టెన్ కొనియాడాడు.