
మహబూబాబాద్ పట్టణంలోని అండర్ బ్రిడ్జి వద్ద ఓ రైతు ధాన్యం బస్తాలు వాహనం నుండి కిందపడిపోయిన సంఘటనలో, ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకన్న మానవత్వం చాటుకుని స్థానికుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. పట్టణంలోని అండర్ బ్రిడ్జి సమీపంలో ఓ రైతుకు చెందిన వడ్ల బస్తాలు కిందపడిపోయాయి. ధాన్యం కిందపడిపోవడంతో ఒంటరిగా ఎత్తుకోవడంలో రైతు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకన్న హృదయం చలించిపోయింది.
విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకన్న వెంటనే రైతుకు సహాయపడి, కిందపడిన ధాన్యం బస్తాలన్నింటినీ కలిసి ఎత్తి వాహనంలోకి ఎక్కించారు. ఈ ఘటనను చూసిన స్థానికులు ట్రాఫిక్ పోలీసు వెంకన్నపై హర్షం వ్యక్తం చేశారు. “ఈ రోజుల్లో అధికారులు తమ డ్యూటీతో పాటు మానవత్వం చూపించడం అరుదు. వెంకన్న లాంటి పోలీసులు సమాజానికి ఆదర్శం” అని స్థానికులు ప్రశంసించారు. ప్రజలు ట్రాఫిక్ పోలీసు శాఖను అభినందించారు.