Reading Time: 2 minutes
Cv Anand Appointed As Telangana Dgp 1991 Batch Ips Officer Takes Charge

Telangana DGP: తెలంగాణ రాష్ట్రానికి కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా C. V. ఆనంద్ ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం హోం సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీవీ ఆనంద్, 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీనియర్ అధికారి. ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి ఎల్లుండి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ నియామకం చేపట్టింది ప్రభుత్వం. అనుభవం, పరిపాలనా సామర్థ్యం ఉన్న అధికారిగా సీవీ ఆనంద్‌కు మంచి పేరు ఉంది. పోలీసు శాఖలో వివిధ కీలక పదవుల్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ముఖ్యంగా శాంతి భద్రతల పరిరక్షణలో కఠిన నిర్ణయాలు తీసుకునే అధికారి‌గా గుర్తింపు పొందారు.

1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన సీవీ ఆనంద్, తెలంగాణ క్యాడర్‌లో తన సేవలను అందిస్తూ అనేక కీలక పదవుల్లో పనిచేశారు. పోలీస్ అధికారిగా మాత్రమే కాకుండా.. మాజీ క్రికెటర్‌గా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా రెండు సార్లు పనిచేసిన ఆయన, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కూడా తన సేవలను అందించారు.

పోలీస్ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని విస్తరించడంలో సీవీ ఆనంద్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ట్రాఫిక్ విభాగంలో e-Challan వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు పారదర్శక సేవలు అందించే దిశగా మార్పులు తీసుకొచ్చారు. మహిళల భద్రత కోసం SHE Teams, SHE Shuttle వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం, అలాగే డ్రగ్స్ నియంత్రణ కోసం H-NEW (Hyderabad Narcotics Enforcement Wing) ఏర్పాటు చేయడం ఆయన ప్రత్యేక కృషిగా చెప్పుకోవచ్చు.

తన సేవల కాలంలో అదనపు కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) హైదరాబాద్, కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్, కమిషనర్ సివిల్ సప్లైస్, CISFలో ఐజీగా (కేంద్ర డిప్యూటేషన్), NISA డైరెక్టర్‌గా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా (2021–2023), అవినీతి నిరోధక బ్యూరో డీజీ, విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోం శాఖ వంటి అనేక కీలక పదవులను నిర్వహించారు.

అవినీతి నిరోధక చర్యల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఆయన ముందుంటారు. ఎన్నికల నిర్వహణలో ఉత్తమ విధానాల అమలు కోసం ఎలక్షన్ కమిషన్ నుంచి నేషనల్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా స్వీకరించడం ఆయన కెరీర్‌లో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది.