
వైట్హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో దుండగుడి జరిపిన కాల్పులు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. అధ్యక్షుడు ట్రంప్తో సహా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇక నిందితుడు కోల్ థామస్ అలెన్ కాల్పులకు ముందు తన లక్ష్యాన్ని ముందుగానే కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. దర్యాప్తులో ఈ విషయాలు బయటపడ్డాయి. అయితే ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ మినహా ట్రంప్తో సహా ఉన్నతాధికారులు తన టార్గెట్గా తెలియజేశాడు. అయితే కాష్ పటేల్ను ఎందుకు మినహాయించాడన్న దానిపై సర్వత్రా చర్చ నడిచింది.

తాజాగా దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాష్ పటేల్ను నిందితుడు ఎందుకు మినహాయించాడన్న దానిపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి దర్యాప్తు చేపట్టారు. ది న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. నిందితుడికి క్రైస్తవ వ్యతిరేక భావాలు ఉన్నాయని గుర్తించారు. కాష్ పటేల్ హిందువు కాబట్టి అతన్ని హిట్ లిస్ట్ నుంచి తప్పించినట్లుగా తెలుస్తోంది.
ఇక విచారణలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. నిందితుడు తన మానిఫెస్టోలో ‘‘రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్’’ అని రాసున్నట్లుగా తెలుస్తోంది. అందులో లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులను లక్ష్యంగా చేయకూడదని పేర్కొన్నట్లు సమాచారం. కాష్ పటేల్ ఎఫ్బీఐ డైరెక్టర్గా ఉండటంతో.. ఈ కారణంగా ఆయనను మినహాయించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇక మానిఫెస్టోలో తీవ్ర రాజకీయ కోణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ ఘటన వెనుక ఉన్న అసలు ఉద్దేశాలు, ప్రభావాలు ఏంటన్నదిపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి మానసిక స్థితి, భావజాలం, సంబంధిత వ్యక్తులపై కూడా విచారణ కొనసాగుతోంది.
నిందితుడి మేనిఫెస్టో ఇదే..
నిందితుడు ‘‘కోల్.’’ ‘‘కోల్డ్ఫోర్స్’’, ‘‘ఫ్రెండ్లీ ఫెడరల్ అసాసిన్’’ పేరుతో తన మేనిఫెస్టో లక్ష్యాన్ని రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. ఈ టార్గెట్లో అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకుని దాడి చేయాలన్న ఉద్దేశాన్ని వ్యక్తం చేశాడు. అధ్యక్షుడితో పాటు ఉన్నతాధికారులే తన లక్ష్యమని కుటుంబ సభ్యులకు ముందుగానే సమాచారం అందించాడు. సాధ్యమైనంత మట్టుకు ప్రాణ నష్టం తక్కువగా జరగాలని.. అవసరమైతేనే తప్ప సీక్రెట్ సర్వీస్పై దాడి చేస్తానని.. లేదంటే చేయబోనని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.