
Stock Market Crash: సోమవారం నాటి జోరును చూసి మంగళవారం కూడా లాభాలు వస్తాయని ఆశించిన ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ గట్టి షాక్ ఇచ్చింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు, కేవలం రెండు గంటల వ్యవధిలోనే కుప్పకూలాయి. మధ్యాహ్నం 12:30 గంటల సమయానికి సెన్సెక్స్ తన గరిష్ట స్థాయి నుంచి ఏకంగా 600 పాయింట్లకు పైగా పతనమైంది. ఈ ఊహించని పరిణామంతో ఇన్వెస్టర్లు సుమారు రూ.3.74 లక్షల కోట్ల మేర లాస్ అయ్యారు.
మార్కెట్ గమనం ఇలా..
మంగళవారం ఉదయం సెన్సెక్స్ 77,094 పాయింట్ల వద్ద స్వల్పంగా నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ, 10:30 గంటల సమయానికి పుంజుకుని 77,493 పాయింట్ల వద్ద డే-హైని తాకింది. అయితే అక్కడి నుంచి అమ్మకాల ఒత్తిడి మొదలైంది. మధ్యాహ్నం 12:30 గంటలకల్లా 76,876 పాయింట్ల వద్ద డే-లోకి పడిపోయింది. అంటే గరిష్ట స్థాయి నుంచి దాదాపు 616 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ కూడా 24,181 పాయింట్ల గరిష్ట స్థాయి నుంచి 23,992 కనిష్ట స్థాయికి పడిపోయింది.
పతనానికి ప్రధాన కారణాలు ఇవే..
బ్యాంకింగ్ ఆస్తుల వర్గీకరణ, కేటాయింపులపై ఆర్బీఐ కొత్త నిబంధనలు (ECL) తీసుకురావడంతో బ్యాంకింగ్ రంగం భారీగా నష్టపోయింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు 2 శాతం మేర పతనమయ్యాయి. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్కు 109.3 డాలర్లకు చేరింది. ఇది ఇన్వెస్టర్లలో ద్రవ్యోల్బణ భయాలను పెంచింది. ఎఫ్ఐఐలు (FIIs) సోమవారం ఒక్కరోజే రూ.1,151.48 కోట్ల విలువైన షేర్లను విక్రయించడం మార్కెట్పై ఒత్తిడి తెచ్చింది.
గత వారం నష్టాల తర్వాత సోమవారం ఐటీ స్టాక్స్ పెరగడంతో, చాలామంది ఇన్వెస్టర్లు ఈరోజు లాభాలను వెనక్కి తీసుకోవడానికి ఆసక్తి చూపారు. జపాన్, హాంకాంగ్ సహా ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉండటం, యూఎస్ ఫ్యూచర్స్ కూడా బలహీనంగా ఉండటం ఈరోజు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. నిఫ్టీ గడువు ముగిసే రోజు కావడంతో ట్రేడర్లు తమ పొజిషన్లను సర్దుబాటు చేసుకోవడం వల్ల ఇంట్రా-డేలో తీవ్రమైన హెచ్చుతగ్గులు కనిపించాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాల పట్ల అనిశ్చితి, దౌత్య చర్చల రద్దు వంటి అంతర్జాతీయ పరిణామాలు కూడా ఇన్వెస్టర్లను భయపెట్టాయి. ప్రస్తుతానికి మార్కెట్ అస్థిరంగా ఉందని, రాబోయే రోజుల్లో కూడా మరిన్ని హెచ్చుతగ్గులు ఉండవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈరోజు మార్కెట్ను బ్యాంకింగ్, ఐటీ, రియల్టీ రంగాలు నష్టాల వైపు నడిపించాయని, సన్ ఫార్మా, రిలయన్స్ వంటి షేర్లు మాత్రమే కొంతమేర సూచీలను ఆదుకున్నాయని విశ్లేషకులు చెప్పారు.