Reading Time: < 1 minute
Andhra University Gets Special Rs 100 Coin And Stamp Centre Honours 100 Year Legacy

Andhra University: విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ తన వందేళ్ల వైభవాన్ని ఘనంగా చాటుకుంటూ మరో అరుదైన గుర్తింపును సాధించింది. శతాబ్ది వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 100 నాణెం, పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయడం విశేషం. ఇది యూనివర్సిటీ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది. అదేవిధంగా ఆధునిక సాంకేతిక రంగాల్లో ముందడుగు వేస్తూ ఆంధ్రా యూనివర్సిటీ, అమెరికాలోని యూనివర్సిటీ అఫ్ ఫ్లోరిడాతో కృత్రిమ మేధస్సు (AI), క్వాంటం టెక్నాలజీ రంగాల్లో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులు, పరిశోధకులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు లభించనున్నాయి.

ఇక “మిషన్ మౌసమ్” ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 180 కోట్ల నిధులతో ట్రాపికల్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ కేంద్రం వాతావరణ పరిశోధనల్లో కీలక పాత్ర పోషించనుంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఆంధ్రా యూనివర్సిటీ ప్రపంచ టాప్ 100 యూనివర్సిటీల్లో స్థానం సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థుల్లో ఉన్న స్కిల్ గ్యాప్‌ను తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తామని, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యూనివర్సిటీని అనుసంధానిస్తామని పేర్కొన్నారు.

యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టులను ఏడాదిలోగా భర్తీ చేస్తామని, పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన పాఠ్యాంశాలను రూపొందించనున్నట్లు వెల్లడించారు. రీసెర్చ్ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు రూ. 250 కోట్ల నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి చదివిన అనేక మంది దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తు చేసిన లోకేష్, విద్యార్థులు ప్రతి ఓటమిని విజయానికి తొలి మెట్టగా భావించాలని సూచించారు. తన రాజకీయ ప్రయాణాన్ని ఉదాహరణగా చూపిస్తూ, మంగళగిరిలో ఓటమి తనలో మరింత కసిని పెంచి తద్వారా భారీ మెజారిటీతో గెలవడానికి దోహదపడిందని చెప్పారు.