
Exam malpractice: అమరావతిలోని NTR యూనివర్సిటీ అఫ్ హెల్త్ సైన్సెస్ లో ఫైనల్ పరీక్షల సందర్భంగా భారీగా మాల్ ప్రాక్టీస్ వెలుగులోకి వచ్చింది. పరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన 20 మంది వైద్య విద్యార్థులను అధికారులు గుర్తించారు. చీటీలు, ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచీల సాయంతో కాపీయింగ్ చేస్తూ వీరు పట్టుబడ్డారు.
పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు యూనివర్శిటీ అత్యాధునిక నిఘా వ్యవస్థను అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 28 మెడికల్, 9 డెంటల్, 7 ఆయుష్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన మొత్తం 540 సీసీటీవీ కెమెరాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్కు అనుసంధానం చేశారు. ఈ కెమెరాల ద్వారా విద్యార్థుల కదలికలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఈరోజు పరీక్షలు రాసిన విద్యార్థుల్లో ముగ్గురు మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డారు. వీరిలో ఇద్దరు హోమియో, ఒకరు ఆయుర్వేద విద్యార్థి ఉన్నారు. ఇప్పటివరకు పట్టుబడిన 20 మంది విద్యార్థుల్లో 16 మంది చీటీలు ఉపయోగించగా, ఇద్దరు స్మార్ట్ వాచీలు, మరో ఇద్దరు సెల్ ఫోన్లతో కాపీయింగ్ చేస్తూ దొరికారు. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. పరీక్షల్లో పారదర్శకత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని అధికారులకు స్పష్టంగా ఆదేశించారు. నిఘా వ్యవస్థ పనితీరుపై సమీక్ష నిర్వహిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అవకతవకలకు పాల్పడిన విద్యార్థులపై గరిష్ఠంగా రెండేళ్ల పాటు పరీక్షలు రాయకుండా డీబార్ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, కొంతమంది ఇన్విజిలేటర్లు కూడా నిబంధనలు అతిక్రమించినట్లు బయటపడింది. రెండు ప్రైవేటు మెడికల్ కాలేజీలలో ఒక్కొక్క ఇన్విజిలేటర్ పరీక్షల సమయంలో సెల్ ఫోన్లు ఉపయోగిస్తూ కనిపించారు. వెంటనే చీఫ్ సూపరింటెండెంట్లు వారి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన వర్శిటీ వీసీ డాక్టర్ చంద్రశేఖర్, నిబంధనలు ఉల్లంఘించిన ఇన్విజిలేటర్లను మూడేళ్ల పాటు పరీక్షల విధులకు దూరంగా ఉంచుతామని తెలిపారు.