Reading Time: < 1 minute
రైల్వే స్టేషన్ల అభివృద్ధికి సహకరించండి.. సీఎం రేవంత్‌ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ

హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని, చర్లపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి అవసరమైన భూసేకరణ, రహదారుల విస్తరణపై వ్యక్తిగత చొరవ చూపాలని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.

నగరానికి నాలుగో ప్రధాన టెర్మినల్‌గా రూ. 430 కోట్లతో అభివృద్ధి చేసిన చర్లపల్లి స్టేషన్‌ను ప్రధాని మోదీ 2025 జనవరిలో ప్రారంభించారు. అయితే, ప్రయాణికుల రాకపోకలకు రోడ్డు సదుపాయం సరిగా లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. FCI గోడౌన్ రోడ్డు నుండి కొత్త భవనం వరకు 200 అడుగుల రోడ్డును, భరత్ నగర్ వైపు ఉన్న రోడ్డును 100 అడుగుల వరకు విస్తరించాలని కోరారు. MMTS ప్లాట్ ఫాం వైపు వెళ్లే ఇరుకైన రోడ్డును 100 మీటర్ల వెడల్పు, 700 మీటర్ల పొడవున అభివృద్ధి చేయాలి. పార్కింగ్ అవసరాల కోసం స్టేషన్ కు ఇరువైపులా సుమారు 5.7 ఎకరాల భూమిని కేటాయించాలన్నారు. రైల్వే శాఖ ఇప్పటికే రూ. 4 కోట్లు చెల్లించినందున, తక్షణమే నీటి కనెక్షన్ ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు.

రూ. 715 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న సికింద్రాబాద్ స్టేషన్ వద్ద ఆల్ఫా హోటల్ నుండి రాటిఫైల్ బస్టాండ్ వరకు ఉన్న రహదారిని 120 అడుగులకు విస్తరించాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. “గతంలోనూ ఈ విషయమై పలుమార్లు లేఖలు రాశాను. మీరు అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు ముందుకు సాగడం లేదు. నగర ప్రయాణికుల సౌకర్యార్థం ఈ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.” అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్గి దృష్టికి తీసుకెళ్లారు. నగర రవాణా వ్యవస్థ మెరుగుపడాలంటే రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..