
Vaibhav Sooryavanshi: రాజస్థాన్ యువ సంచలనం మరోసారి రెచ్చిపోయాడు. నిన్న పంజాబ్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ తన మెరుపులతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఈ 15 ఏళ్ల కుర్రాడు, కేవలం 16 బంతుల్లోనే 43 పరుగులు సాధించి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. అతని ఇన్నింగ్స్లో 5 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. ఈ ఐదు సిక్సర్లతో వైభవ్ తన టీ20 కెరీర్లో (27 ఇన్నింగ్స్ల్లో) మొత్తం 99 సిక్సర్లకు చేరుకున్నాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన రికార్డు ప్రస్తుతం కీరన్ పొలార్డ్ (843 బంతుల్లో) పేరిట ఉంది. అయితే.. వైభవ్ ఇప్పటివరకు కేవలం 511 బంతులే ఎదుర్కొని 99 సిక్సర్లకు చేరుకోవడం విశేషం. ఇక నెక్ట్స్ మ్యాచ్లో ఈ బుడ్డోడు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. పంజాబ్ టాప్ ఆర్డర్లో ప్రభ్సిమ్రాన్ సింగ్ (44 బంతుల్లో 59), ప్రియాన్ష్ ఆర్య (11 బంతుల్లో 29), కూపర్ కానలీ (14 బంతుల్లో 30) మెరుపులు మెరిపించినప్పటికీ, ఎవరూ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. అయితే చివరలో మార్కస్ స్టోయినిస్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 22 బంతుల్లో 6 సిక్సర్లు, 4 ఫోర్లతో అజేయంగా 62 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా ఆఖరి 3 ఓవర్లలో రాజస్థాన్ బౌలర్లు ఏకంగా 55 పరుగులు సమర్పించుకున్నారు. యువ బౌలర్ బ్రిజేష్ శర్మ వేసిన చివరి ఓవర్లో స్టోయినిస్ 24 పరుగులు సాధించాడు.
రాజస్థాన్ బౌలర్లలో బ్రిజేష్ శర్మతో పాటు స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ (1/40) కూడా ధారాళంగా పరుగులు ఇచ్చారు. అయితే యువ లెగ్ స్పిన్నర్ యశ్రాజ్ పుంజా మాత్రం తన ప్రతిభతో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 41 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. 16వ ఓవర్ వరకు పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేసిన యశ్రాజ్.. ప్రమాదకరంగా మారుతున్న కానలీని బోల్తా కొట్టించాడు. అలాగే అర్ధ సెంచరీతో ఉన్న ప్రభ్సిమ్రాన్ను సైతం తన స్పిన్ మాయాజాలంతో అవుట్ చేసి పంజాబ్ను దెబ్బతీశాడు. యశ్రాజ్ అద్భుత పోరాటం చేసినప్పటికీ, స్టోయినిస్ పవర్ హిట్టింగ్ ముందు రాజస్థాన్ బౌలర్లు నిలవలేకపోయారు.