
UAE vs Saudi Arabia: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) చమురు ఉత్పత్తి దేశాల కూటమి ఒపెక్ నుంచి వైదొలగడం సంచలనంగా మారింది. అయితే, దీనికి కారణాల్లో సౌదీ అరేబియాతో సంబంధాలు చెడిపోవడం కూడా ఒకటని తెలుస్తోంది. ఈ రెండు దేశాల మధ్య సఖ్యత కుదరడం లేదు. ఇటీవల, ఇరాన్ యుద్ధంలో యూఏఈపై భారీగా దాడులు జరిగాయి. ఆ సమయంలో సౌదీ హెల్ప్ చేయలేదని యూఏఈ బహిరంగంగానే వ్యాఖ్యానించింది. మరోవైపు, ఇరాన్ అమెరికాల మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిగా పనిచేయడం యూఏఈకి నచ్చడం లేదు.
ఇటీవలి కాలంలో పాకిస్తాన్, సౌదీ అరేబియాల మధ్య సైనిక బంధం చాలా పెరిగింది. ఇరు దేశాల మధ్య సైనిక ఒప్పందం కూడా కుదిరింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్పై యూఏఈ ఒకింత గుర్రుగా ఉంది. తాను అప్పుగా ఇచ్చిన 3.5 బిలియన్ డాలర్ల రుణాన్ని తిరిగి ఇచ్చేయాలని కోరింది. అయితే, ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న పాకిస్తాన్ రుణాన్ని, సౌదీ అరేబియా సెటిల్ చేసింది. ఇరాన్ దాడుల వల్ల యూఏఈ చాలా నష్టపోయింది. ఈ సమయంలో పాక్ నుంచి బలమైన మద్దతు రాలేదు, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల్లో పాక్ మధ్యవర్తిగా వ్యవహరించింది. పాకిస్తాన్ ఇరాన్ పక్షాల నిలిచిందని యూఏఈ భావించింది. ఇరాన్పై కఠినంగా వ్యవహరించాలని సూచించినా, పాక్ పట్టించుకోలేదు. దీంతో యూఏఈ తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని పాక్పై ప్రెజర్ పెట్టింది.
Read Also: The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
ఇక చమురు రంగంలో సౌదీ అరేబియా ఆధిపత్యాన్ని దెబ్బకొట్టే విధంగా ఒపెక్ నుంచి యూఏఈ బయటకు వచ్చింది. దీని వల్ల యూఏఈకి అంతర్జాతీయ చమురు డిమాండ్కు అనుగుణంగా చమురు ఉత్పత్తి చేసే అవకాశం లభిస్తుంది. ఇన్నాళ్లు ఒపెక్ కూటమిలో సౌదీ అరేబియా గుత్తాధిపత్యం నడిచింది. చమురు ధరలు, చమురు ఉత్పత్తిని సౌదీ ప్రభావితం చేసేది, ఇప్పుడు ఆ పరిస్థితిని నుంచి యూఏఈ బయటకు వచ్చింది.
గతం కొంత కాలంగా సౌదీ-యూఏఈ మధ్య సంబంధాలు బాగా లేవు. యెమెన్ యుద్ధం, యెమెన్ పాలనలో ఇరు దేశాలు ఒక్కో కూటమికి మద్దతు ఇస్తున్నాయి. ఇక సుడాన్ అంతర్గత ఘర్షణల్లో కూడా రెండు దేశాలు వేర్వేరు కూటములకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు మిత్రదేశాలుగా ఉన్న ఈ రెండింటి మధ్య ఇప్పుడు పరిస్థితి ఉప్పూ నిప్పుగా మారింది. ఇదిలా ఉండగా, యూఏఈకి భారత్తో బలమైన సంబంధాలు ఉండగా, సౌదీ అరేబియా పాకిస్తాన్, టర్కీలతో కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేస్తున్నాయి. వీటి మధ్య త్రైపాక్షి సైనిక ఒప్పందంపై చర్చ జరుగుతోంది.