
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి రోజురోజుకు విచిత్రంగా మారుతోంది. ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. అప్పుడే వార్నింగ్లు ఇస్తారు.. అంతలోనే మాట మార్చేస్తారు. ప్రస్తుతం ట్రంప్ వైఖరిని గమనిస్తున్న వాళ్లకు సులువుగా అర్థమవుతుంది.

ఇరాన్తో ఏర్పడిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం బుధవారంతో ముగుస్తుంది. అయితే గడువు ముగిసేలోపు శాంతి ఒప్పందం చేసుకోవాలని.. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని పదే పదే ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. కానీ అమెరికాతో చర్చలకు ఇరాన్ ససేమిరా అంది. బెదిరిస్తే చర్చలు జరపబోమని తేల్చి చెప్పింది. కానీ విచిత్రంగా 24 గంటల ముందే ఏకపక్షంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిరవధికంగా పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటన అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇరాన్ అడగకుండానే పొడిగించడమేంటి? అని ప్రపంచ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.

కాల్పుల విరమణ అయితే పొడిగిస్తున్నామని.. హార్ముజ్ దిగ్బంధం మాత్రం కొనసాగుతుందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. పాకిస్థాన్ అభ్యర్థన మేరకు ఇరాన్పై కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగిస్తున్నట్లు ట్రంప్ రాసుకొచ్చారు. ‘‘ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా విభజించబడింది. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అభ్యర్థన మేరకు.. ఇరాన్ నాయకులు, ప్రతినిధులు ఏకగ్రీవ ప్రతిపాదనతో ముందుకు వచ్చే వరకు ఇరాన్పై దాడిని నిలిపివేయమని మమ్మల్ని కోరారు. అందువల్ల దిగ్బంధనాన్ని కొనసాగించాలని.. ఇతర అన్ని విషయాలకు సిద్ధంగా ఉండాలని నేను నా సైన్యానికి ఆదేశించాను. కాబట్టి వారి ప్రతిపాదన వచ్చే వరకు.. చర్చలు ఒక ముగింపుకు వచ్చే వరకు నేను కాల్పుల విరమణను పొడిగిస్తున్నాను..’’ అని ట్రంప్ రాసుకొచ్చారు.
హార్ముజ్పై మరో పోస్ట్..
కాల్పుల విరమణ జరిగినప్పటికీ హార్ముజ్పై దిగ్బంధనాన్ని ఎందుకు ఎత్తివేయలేదో మరో పోస్ట్లో వివరించారు. ‘‘హార్ముజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ కోరుకోవడం లేదు. దానిని తెరిచి ఉంచడం ద్వారా వారు రోజుకు 500 మిలియన్ డాలర్లు సంపాదించాలని కోరుకుంటున్నారు. ఒకవేళ అది మూసివేస్తే..వారు అంతే నష్టపోతారు. నేను దానిని పూర్తిగా దిగ్బంధించాను కాబట్టే.. దానిని మూసివేయాలని వారు చెబుతున్నారు. అందుకే వారు కేవలం పరువు కాపాడుకోవాలని అనుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం కొంతమంది నా దగ్గరకు వచ్చి.. ‘‘సర్’’.. ఇరాన్ వెంటనే హార్ముజ్ జలసంధిని తెరవాలని కోరుకుంటోంది. కానీ మనం అలా చేస్తే.. వారి నాయకులతో సహా వారి దేశంలోని మిగిలిన భాగాన్ని మనం పేల్చివేస్తే తప్ప ఇరాన్తో ఎప్పటికీ ఒప్పందం కుదరదు అని చెప్పారు.’’ అని ట్రంప్ రాసుకొచ్చారు.
ట్రంప్నకు షెహబాజ్ ధన్యవాదాలు
కాల్పుల విరమణను ట్రంప్ ప్రకటించిన కాసేపటికే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎక్స్లో స్పందించారు. ‘‘కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలు ఫలించేలా కాల్పుల విరమణను పొడిగించాలన్న మా అభ్యర్థనను అంగీకరించినందుకు నా తరపున, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ తరపున..అధ్యక్షుడు ట్రంప్కు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాపై ఉంచిన నమ్మకం, విశ్వాసంతో ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి పాకిస్థాన్ తన శాయశక్తులా ప్రయత్నాలను కొనసాగిస్తుంది. ఇరు పక్షాలు కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటాయని.. ఈ సంఘర్షణను శాశ్వతంగా అంతం చేయడానికి ఇస్లామాబాద్లో జరగనున్న రెండో విడత చర్చల్లో పూర్తి శాంతి ఒప్పందానికి రాగలరని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.’’ అని షరీఫ్ రాసుకొచ్చారు.
On my personal behalf and on behalf of Field Marshal Syed Asim Munir, I sincerely thank President Trump for graciously accepting our request to extend the ceasefire to allow ongoing diplomatic efforts to take their course.
With the trust and confidence reposed in, Pakistan…
— Shehbaz Sharif (@CMShehbaz) April 21, 2026
ఇంకా స్పందించని ఇరాన్
ఆశ్చర్యం ఏంటంటే.. కాల్పుల విరమణ పొడిగిస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటించిన ప్రకటనపై ఇరాన్ ఇంకా స్పందించలేదు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ సలహాదారు మాట్లాడుతూ.. ట్రంప్ కాల్పుల విరమణకు ‘‘అర్థం లేదు’’ అని అన్నారు. ఇరాన్ ఎంపీ మహమూద్ నబావియన్ మాట్లాడుతూ.. ఇకపై అమెరికాతో చర్చలు జరపడం ‘‘పూర్తిగా హానికరం, అసంబద్ధం.’’ అని అన్నారు. అమెరికాతో చర్చల కోసం ఇస్లామాబాద్ వెళ్లిన ప్రతినిధి బృందంలో మహమూద్ నబావియన్ కూడా ఉన్నారు.