Reading Time: < 1 minute
భగ్గుమంటున్న సూర్యుడు.. తెలుగురాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఏప్రిల్‌ నెలలోనే నిప్పులు చెరిగే ఎండలు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని పలు నగరాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యథికంగా వరంగల్ జిల్లాలో 44 డిగ్రీలు నిర్మల్‌ జిల్లా తానూరులో 43.5 డిగ్రీలు, నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌లో 43.5 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక రాబోయే రోజుల్లో ఈ ఉష్ణగ్రోతలు మరింత పెరిగే అవకాశం ఉందని కొన్ని జిల్లాల్లో ప్రస్తుత ఉష్ణోగ్రతల కంటే 2 -3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

గురువారం కొన్ని జిల్లాలో అధిక రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. శుక్ర, శనివారాల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాలో అధిక ఉష్ణ్రోగతలతో పాటు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాల్లో సుమారు 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది.

ఇక ఏపీలో మరో రెండు రోజుల పాటు భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయిని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ, రేపు పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల మధ్యకు చేరే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయని పేర్కొంది. బుధవారం 275 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని.. గురువారం మన్యం, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో గరిష్ఠంగా 43-44 మధ్య ఉష్ణోగ్రతలు నమోదుకు అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.