
విజయనగరం, ఏప్రిల్ 13: పెళ్లి అంటే సాధారణంగా ఆడంబరాలు, విందు భోజనాలు, బంధువుల సందడితో కళకళలాడే ఓ నిండు వేడుక. కానీ విజయనగరం పట్టణంలో జరిగిన ఒక వివాహ వేడుక మాత్రం అందుకు భిన్నంగా సామాజిక బాధ్యతకు మేళవింపుగా నిలిచింది. ఈ పెళ్లి కేవలం ఆనందానికి, జ్ఞాపకాలకు మాత్రమే కాకుండా ఆపదలో ఉండే వారి ప్రాణాలను కాపాడే సందేశానికి వేదికగా మారింది. జిల్లాలో సామాజిక సేవకు ముందుండే దొంతల పాపునాయుడు తన కుమారుడి వివాహ రిసెప్షన్ను అందరికీ సామాజిక బాధ్యతను గుర్తుచేసే ఓ మంచి కార్యక్రమంగా మలిచారు. ఓ ఫంక్షన్ హాల్ లో ఘనంగా ఏర్పాటు చేసిన ఈ వేడుకలో ప్రత్యేకంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడమే ఇక్కడ విశేషం.
సాధారణంగా పెళ్లిళ్లలో వినోదం, విందు, బంధువుల హడావుడి మాత్రమే ఉండగా ఇక్కడ మాత్రం రక్తదానం ద్వారా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో వధూవరులు స్వయంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. వారిని చూసి స్ఫూర్తిని పొందిన మరికొందరు బంధువులు, స్నేహితులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఒకవైపు పెళ్లి సందడి కొనసాగుతుండగా మరోవైపు రక్తదానం కోసం వరుసగా నిలబడ్డ దాతలు ఆ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా మారారు. అలా పెళ్లి వేడుకలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచారు ఓ యువజంట.
వారి వినూత్న ఆలోచనతో స్థానికులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పెళ్లి వంటి వ్యక్తిగత వేడుకను సామాజిక బాధ్యతతో కలగలపడం ద్వారా కొత్త తరానికి మంచి సందేశం ఇచ్చారని అభినందిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు మరింత మందికి స్పూర్తిగా మారి సమాజంలో సేవా భావం పెరగాలని వివాహానికి వచ్చిన వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.