
హైదరాబాద్, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) పదో తరగతి పరీక్షల ఫలితాలు రేపు (ఏప్రిల్ 14) విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు సాయంత్రంలోపు వెలువడనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరంతా ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు అధికారిక సీబీఎస్సీ వెబ్సైట్లలో https://www.cbse.gov.in/ లేదా results.cbse.nic.in లేదా cbse.nic.in మాత్రమే చెక్ చేసుకోవల్సి ఉంటుంది. వీటితోపాటు తో పాటు డిజిలాకర్ (DigiLocker), ఉమాంగ్ (UMANG) యాప్ల ద్వారా కూడా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. విద్యార్ధులు తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. గత ఏడాది10వ, 12వ తరగతి ఫలితాలు రెండూ ఒకేసారి మే 13న ప్రకటించారు.
కాగా సీబీఎస్సీ పదో తరగతిలో ఈ ఏడాది నుంచి రెండో విడతలుగా బోర్డు పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ విధానంలో విద్యార్థులు గరిష్టంగా మూడు సబ్జెక్టులలో తమ స్కోర్లను మెరుగుపరుచుకోవడానికి మళ్లీ పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తారు. సెషన్ 1 ఫలితాల్లో తమ మార్కులను మెరుగుపరుచుకోవాలనుకునే విద్యార్థుల కోసం బోర్డు సెషన్ 2 పరీక్షలను నిర్వహించనుంది. ఈ ఇంప్రూవ్మెంట్ పరీక్షలు మే 15 నుంచి ప్రారంభమవుతాయి. అలాగే పదో తరగతిలో ఒకటి లేదా రెండు మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు కూడా ఇవ్వనున్నారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అభ్యర్థులు మొత్తం మీద కనీసం 33 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది.
ఇక సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాలు మే నెల రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 10వ తరగతి పరీక్షలు మార్చి 11న ముగియగా, 12వ తరగతి పరీక్షలు 2026 ఏప్రిల్ 10న ముగిశాయి. పదో తరగతి, 12వ తరగతికి కలిపి ఈ ఏడాది దాదాపు 43 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. వీరంతా ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.