Reading Time: 2 minutes
Perni Nani Criticizes Chandrababu Naidu False Debt Claims And Budget Mismanagement In Andhra Pradesh

Perni Nani : కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని.. అప్పుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర అప్పుల విషయంలో ప్రభుత్వం సరైన వివరాలు ఇవ్వడం లేదని పేర్ని నాని అన్నారు. గత ఏడాది సుమారు రూ.1.03 లక్షల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం, ఈ ఏడాది రూ.97 వేల కోట్ల అప్పు తీసుకుంటామని బడ్జెట్‌లో పేర్కొన్నప్పటికీ వాస్తవ పరిస్థితి వేరుగా ఉందని ఆయన విమర్శించారు. కార్పొరేషన్ల ద్వారా తీసుకుంటున్న అప్పులను బడ్జెట్‌లో చూపించడం లేదని ఆరోపించారు. రాష్ట్రానికి ఆదాయాలు తగ్గుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని చెప్పడం సరైంది కాదన్నారు నాని. రెండు నెలల్లోనే రూ.57 వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పడం వాస్తవానికి దూరమని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నివసిస్తున్న కరకట్ట ఇల్లు ఎవరిదో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని పేర్ని నాని ప్రశ్నించారు. అది వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌దా, లేక AP Capital Region Development Authorityదా లేదా చంద్రబాబుదా అనే విషయాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు. మరోవైపు టాటా మోటార్స్ కు భూములు ఇచ్చిన విషయంలో కూడా ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఆయన అన్నారు. గుజరాత్‌లో ఎకరాకు రూ.38 లక్షల చొప్పున భూములు ఇచ్చారని, కానీ రూపాయికి ఇచ్చారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విశాఖలో ఉన్న GITAM University ఆక్రమించిన భూములను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తోందని పేర్ని నాని ఆరోపించారు. వేల కోట్ల విలువైన భూములపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం మౌనం వహిస్తోందన్నారు.

మరోవైపు.. తిరుమల లడ్డూ విషయంలో కూడా ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆయన అన్నారు. తిరుపతిలో జరిగిన సభలో పవన్‌ కల్యాణ్ జంతువుల కొవ్వు కలిపారని ఆరోపించారని, కానీ అసెంబ్లీలో మాత్రం ఆ మాటలు మార్చారని విమర్శించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు నాని. హెరిటేజ్ ఫుడ్స్‌ ద్వారా ద్వారా ప్రభుత్వానికి నెయ్యి మరియు ఇతర పాల ఉత్పత్తులు సరఫరా చేసిన విషయంపై కూడా పేర్ని నాని ప్రశ్నలు లేవనెత్తారు. ఈ అంశంపై ప్రభుత్వం చర్చకు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. ఇక, రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ, సూపర్ సిక్స్ వంటి హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని పేర్ని నాని విమర్శించారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం కూడా జరగలేదని, గతంలో నిర్మించిన ఇళ్లనే ఇప్పుడు ప్రారంభించబోతున్నారని అన్నారు. మొత్తానికి రాష్ట్ర అప్పులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిజాలను దాచిపెడుతోందని, అసెంబ్లీ సాక్షిగా తప్పుడు లెక్కలు చెబుతోందని పేర్ని నాని ఆరోపించారు.