
శనివారం ప్రధాని మోడీకి చెందిన కీలక కార్యక్రమం జరగనుంది. నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాలు అందించనుంది. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా 51 వేల మందికి పైగా కొత్తగా నియమితులైన అభ్యర్థులకు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ లెటర్లు అందజేయనున్నారు. సెప్టెంబర్ 19న ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది.
సెప్టెంబర్ 19న మధ్యాహ్నం 12:30 గంటలకు రోజ్గార్ మేళా ప్రారంభం కానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని.. ఎంపికైన అభ్యర్థులతో మాట్లాడనున్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి 45 ప్రాంతాల్లో ఈ రోజ్గార్ మేళా నిర్వహించనున్నట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది.
ఏయే శాఖల్లో ఉద్యోగాలు?
అపాయింట్మెంట్ లెటర్లు అందుకోనున్న అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో విధుల్లో చేరనున్నారు. వీటిలో రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, రక్షణ మంత్రిత్వ శాఖ తదితర కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు ఉన్నాయి.
యువతకు ఉద్యోగ అవకాశాలను విస్తరించడం, దేశ అభివృద్ధి ప్రక్రియలో వారిని మరింత భాగస్వాములను చేయడమే రోజ్గార్ మేళా లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 20వ రోజ్గార్ మేళా పూర్తయ్యే నాటికి ఈ కార్యక్రమం ద్వారా అపాయింట్మెంట్ లెటర్లు అందుకున్న యువత సంఖ్య సుమారు 12.75 లక్షలకు చేరుతుందని ప్రభుత్వం తెలిపింది. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో వీరికి నియామకాలు కల్పించినట్లు వెల్లడించింది.