Reading Time: < 1 minute
Mamata Banerjee Backs Congress Nandigram Bypoll

Mamata Banerjee:  పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో వరస ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. నందిగ్రామ్ పోరు నుంచి మమతా బెనర్జీ అభ్యర్థి సంచితా ప్రధాన్ డే తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో తాము కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు మమతా బెనర్జీ చెప్పడం సంచలనంగా మారింది. మమతా వర్గం అభ్యర్థి ఉప పోరు నుంచి తప్పుకున్న కొన్ని గంటల్లోనే దీదీ ఈ నిర్ణయానికి వచ్చారు.

నందిగ్రామ్ ఎన్నికల కోసం తమ వర్గం మరో అభ్యర్థిని బరిలోకి దింపబోమని ఆమె స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు బీజేపీపై ఐక్యంగా పోరాడేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం ఇండియా కూటమితో సంఘీభావానికి సంకేతమని మమతా చెప్పారు. “మేము పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. బీజేపీ భారత్ నుంచి వెళ్లిపోవాలని కోరుకుంటున్నాను. ఇండియా కూటమికి మా పూర్తి సంఘీభావం ఉంటుంది” అని మమత పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి మిలన్ ప్రధాన్‌ పోటీలో ఉన్నారు.

తనకు రాహుల్ గాంధీ పోన్ చేశారని, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా మద్దతు తెలిపారని చెప్పారు. తామంతా కలిసి పోటీ పోరాడుతామని అన్నారు. బీజేపీపై విమర్శలు చేస్తూ.. జుమ్లా పార్టీగా అభివర్ణించారు.

ఒకే రోజు పార్టీ, పార్టీ గుర్తు, పార్టీ అభ్యర్థిని కోల్పోయిన మమతా బెనర్జీ:

ఇప్పటికే వర్గపోరుతో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో మమతా వర్గం, రెబల్ వర్గాల పోరు కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు చేరింది. దీంతో ఈసీ టీఎంసీ పేరు, ఎన్నికల గుర్తును ఫ్రీజ్ చేసింది. మమతా బెనర్జీ వర్గానికి ‘ఫుట్‌బాల్ ప్లేయర్’, రిటబ్రత వర్గానికి ‘ఎన్వలప్ కవర్’ గుర్తుల్ని అందించింది.

శుక్రవారం ఈ పరిణామాలు సంభవించిన గంటల వ్యవధిలోనే మమతా బెనర్జీకి వరస షాక్‌లు ఎదురయ్యాయి. నందిగ్రామ్ ఉప ఎన్నికలకు మమతా వర్గం తన అభ్యర్థిగా ప్రకటించిన సంచితా ప్రధాన్ డే, సీఎం సువేందు అధికారితో భేటీ అయిన గంటల వ్యవధిలోనే నందిగ్రామ్ పోరు నుంచి తప్పుకున్నారు. ఒకే రోజు పార్టీని, పార్టీ ఎన్నికల గుర్తును, పార్టీ అభ్యర్థిని మమతా బెనర్జీ కోల్పోయినట్లైంది.