Reading Time: < 1 minute
Nse Ipo Subscription Day 2 Gmp Details

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియ ప్రారంభమైన రెండో రోజునే ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన పొందింది. ఈ ఐపీఓ ప్రారంభమైన రెండు రోజుల్లోనే 100 శాతానికి పైగా భర్తీ అయింది. ప్రస్తుతం ఈ ఐపీఓ మొత్తం 2.04 రెట్లు పైగా సబ్‌స్క్రైబ్ కాగా, రిటైల్ కోటా కూడా పూర్తిగా నిండిపోయింది. దరఖాస్తు చేసుకోవడానికి సోమవారం వరకు గడువు ఉండటంతో ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది.

ఈ ఐపీఓలో రిటైల్ కేటగిరీ 1.07 రెట్లు, క్యూఐబీ (QIB) కోటా 3.70 రెట్లు, ఎన్‌ఐఐ (NII) కోటా 2.07 రెట్ల చొప్పున సబ్‌స్క్రిప్షన్ సాధించాయి. సెప్టెంబర్ 17న ప్రారంభమైన ఈ పబ్లిక్ ఇష్యూలో రిటైల్ ఇన్వెస్టర్లు సెప్టెంబర్ 21 వరకు బిడ్ దాఖలు చేసే అవకాశం ఉంది. కంపెనీ ఇన్వెస్టర్ల కోసం సెప్టెంబర్ 16నే ఈ ఇష్యూను తెరిచి, ఆ ద్వారా రూ. 6,746.18 కోట్లను సమీకరించింది.

ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లోకి కొత్తగా ప్రవేశించడానికి (IPO) ముందు, ఆ షేర్లకు అనధికారికంగా జరిగే కొనుగోలు, అమ్మకాల మార్కెట్‌ను గ్రే మార్కెట్ అంటారు. ప్రస్తుతం దీనికి గ్రే మార్కెట్‌లో క్షీణత కనిపిస్తుంటంతో ఇన్వెస్టర్లలో కొంత ఆందోళన కలిగిస్తోంది. ఒక దశలో ఈ ఐపీఓ రూ. 310 వరకు పలికింది. అయితే ప్రైస్ బ్యాండ్ వెల్లడైన తర్వాత ఇది క్రమంగా తగ్గుతూ వచ్చింది. నివేదికల ప్రకారం గురువారం రూ. 142 వద్ద ఉన్న గ్రే మార్కెట్ ప్రైస్, ప్రస్తుతం రూ. 105కి పడిపోయింది.

ఇక ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్‌ను రూ. 1,700 నుంచి రూ. 1,785 మధ్య కంపెనీ నిర్ణయించింది. ఒక లాట్‌లో 8 షేర్లు ఉండటంతో, ఇన్వెస్టర్లు కనీసం రూ. 14,280 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ప్రతి షేరుపై రూ. 170 రాయితీని ప్రకటించారు. ఈ ఐపీఓ మొత్తం పరిమాణం రూ. 22,561.57 కోట్లుగా ఉంది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద వస్తుండగా.. ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు 12.64 కోట్ల షేర్లను విక్రయిస్తున్నారు. ప్రారంభంలో ఈ ఇష్యూ సైజు రూ. 30,000 కోట్లుగా ఉండగా.. దానిని సవరించారు. సోమవారం వరకు ట్రేడింగ్ ముగిసే సమయానికి తుది ఫలితాలపై మరింత స్పష్టత రానుంది.