Reading Time: < 1 minute
Actor Suhas X Note Omits Telugu Audience Mention Controversy

‘మండాడి’ సినిమా సక్సెస్ మీట్‌లో సుహాస్ రంగును ఉద్దేశించి దర్శకుడు చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. డైరెక్టర్ వివరణ ఇచ్చుకున్నప్పటికీ, ఈ వర్ణ వివక్ష (కలర్ డిస్క్రిమినేషన్) వివాదం నెట్టింట హాట్ టాపిక్‌గానే కొనసాగుతోంది. అయితే, ఈ రచ్చకంతటికీ ముగింపు పలుకుతూ, తనను గుండెల్లో ప్రేక్షకులపై పెట్టుకున్న ప్రేమను చాటుకుంటూ యాక్టర్ సుహాస్ తాజాగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ ఎమోషనల్ లెటర్ రిలీజ్ చేశాడు. తన రంగు గురించి జరుగుతున్న చర్చకు సుహాస్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. “నా పనితనాన్ని చూసి, మరే ఇతర విషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా మీరు నన్ను అక్కున చేర్చుకున్నారు. నా ప్రయాణమే దానికి అతిపెద్ద నిదర్శనం” అంటూ సుహాస్ రాసిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రేక్షకులు తన రంగు చూడలేదని, కేవలం తనలోని ప్రతిభను మాత్రమే చూసి బేషరతుగా ఆదరించారని సుహాస్ తన లేఖ ద్వారా కుండబద్దలు కొట్టాడు.

యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేసుకునే స్థాయి నుంచి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఆ తర్వాత లీడ్ యాక్టర్‌గా తాను ఎదగడానికి అడుగడుగునా తెలుగు ప్రేక్షకులే అండగా నిలిచారని సుహాస్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. “ఈరోజు నేనీ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మీ ప్రేమ, ప్రోత్సాహం, నాపై మీరు ఉంచిన నమ్మకమే. ఆ గుర్తింపే నాకు ‘మండాడి’ లాంటి అద్భుతమైన చిత్రంలో అవకాశం వచ్చేలా చేసింది” అని తన ఎదుగుదలకు కారణమైన ప్రేక్షకులకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపాడు. తన కెరీర్ మొదట్లో అండగా నిలబడి, ఈ స్థాయికి చేరేలా ప్రోత్సహించిన వారిని తాను ఎప్పటికీ మర్చిపోనని సుహాస్ స్పష్టం చేశాడు. తన నటనతో ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి భవిష్యత్తులో మరింత కష్టపడతానని మాటిచ్చాడు. ఇంత చెప్పుకొచ్చాడు కానీ తెలుగు ఆడియన్స్ రంగు చూసి ఎంకరేజ్ చేయలేదు అని అర్ధం వచ్చేలా మాట్లాడిన తమిళ దర్శకుడే తెలుగు ప్రేక్షకులను ఉద్దేశించి అనలేదు అని క్లారిటీ ఇచ్చాడు. కానీ సుహాస్ మాత్రం తన క్లారిటీ నోట్ లో ఇప్పటివరకు ఆదరించి అసలు ఆ తమిళ సినిమా టీం కంటపడేలా చేసిన తెలుగు ఆడియన్స్ ను తెలుగు వారు అని కుడా సంబోదించలేకపోవడం గమనార్హం.