
కోరుట్ల: హరిబాబు మృతదేహం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చేరుకుంది. హరిబాబు మృతదేహంతో పాటు పోలీస్ స్టేషన్కు మృతుడి కుటుంబ సభ్యులు వెళ్లారు. న్యాయం చేయాలని రోడ్డుపై హరిబాబు తల్లి, బంధువులు బైఠాయించారు.
ఇలా నిరసన తెలపడం సరికాదని, ఇప్పటికే నిందితులపై కేసులు నమోదు చేశామని పోలీసులు నచ్చ చెప్పడంతో హరిబాబు బంధువులు తిరిగి వెళ్లిపోయారు. అన్నమయ్య గుట్ట ప్రాంతంలోని ఇంటి నుంచి హరిబాబు శవయాత్ర జరిగింది.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడైన ఆమె భర్త హరిబాబు (26) నిజామాబాద్ నగరంలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం ఆర్ఆర్ చౌరస్తాలోని షాపింగ్ కాంప్లెక్స్ ఎదుట కారులో మరో ఇద్దరు వ్యక్తులతో వచ్చిన వైష్ణవి అన్న సంతోష్ కారు నుంచి దిగి కత్తితో హరిబాబును విచక్షణా రహితంగా పొడిచాడు.
10 సెకండ్ల వ్యవధిలో తొమ్మిది సార్లు పొడవగా.. హరిబాబు రక్తపుమడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అనంతరం ముగ్గురు కలిసి వచ్చిన కారులోనే పారిపోయారు. హరిబాబు హత్య అనంతరం గురువారం రాత్రి వైష్ణవి సోదరుడు సంతోష్ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. హరిని తానే హత్య చేశానని.. తన చెల్లిని చంపినందుకు ప్రతీకారంగానే అతన్ని హత్యచేశానని తెలిపాడు. తాను పోలీసుల ఎదుట లొంగిపోనున్నట్టు చెప్పాడు.