
న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో ముగ్గురు విదేశీయులు ఇమ్మిగ్రేషన్ను తప్పించుకుని మ్యూనిచ్కు వెళ్లిన ఘటనలో దేశీయ ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియాకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. భద్రతా ఉల్లంఘన, ఇమ్మిగ్రేషన్ లోపానికి సంబంధించిన ఈ ఘటనపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
2026, సెప్టెంబర్ 3 అర్థరాత్రి అమృత్సర్ నుంచి ఇటలీకి చెందిన ముగ్గురు ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయంలో హబ్ అండ్ స్పోక్ విధానంలో భాగంగా డొమెస్టిక్ అరైవల్ నుంచి ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ఏరియాకు తప్పుగా పంపడంతో తప్పనిసరిగా జరగాల్సిన డిపార్చర్ ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ లేకుండానే వీరు కేవలం గంట వ్యవధిలో మరో విమానంలో మ్యూనిచ్కు వెళ్లిపోయారు.
ఇమ్మిగ్రేషన్ తనిఖీలు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉల్లంఘనలపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎయిర్ ఇండియాకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసి.. ఎయిర్ పోర్టులో భద్రతా, ఇమ్మిగ్రేషన్ ఉల్లంఘనలపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఈ భద్రతా లోపంపై స్పందించింది. ఈ ఘటనలో డీజీసీఏ నుంచి తమకు ఎలాంటి నోటీస్ రాలేదని తెలిపింది. ఎయిర్ పోర్టు భద్రత మల్టీ-ఏజెన్సీల పరిధిలో ఉంటుందని పేర్కొంది.
►ALSO READ | అప్పు కోసం పాక్ కొత్త డ్రామా.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్పై రివార్డ్ పెంపు