
Captain India: కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన యువ హీరోలలో ఒకరు. ఆయన 2011లో ‘ప్యార్ కా పంచనామా’ చిత్రంతో తన కెరీర్ను ప్రారంభించి ‘భూల్ భూలయ్యా 2’ మరియు ‘భూల్ భూలయ్యా 3’ వంటి వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్ గా అనురాగ్ బసు దర్శకత్వంలో శ్రీలీలతో ఒక మ్యూజికల్ లవ్ స్టోరీలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే కార్తీక్ ఆర్యన్ కెరీర్లో ఎప్పటి నుంచో చర్చలో ఉన్న సినిమా ‘కెప్టెన్ ఇండియా’. ఈ ఏవియేషన్ థ్రిల్లర్ కు సంబంధించి దాదాపు ఐదేళ్ల క్రితమే ఆఫీషియల్ ప్రకటన వెలువడినా.. ఆ తర్వాత ప్రాజెక్ట్ విషయంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.
ఒక దశలో సినిమా అసలు పట్టాలెక్కుతుందా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. దర్శకుడు మారడం, నిర్మాణం ఆలస్యం కావడం వంటి పరిణామాల మధ్య ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. అయితే ఈసారి కారణం సినిమాకు కథానాయికగా ఓ ప్రముఖ దక్షిణాది నటిని ఎంపిక చేసినట్లు రావడంతో ఈ ప్రాజెక్ట్ ఆసక్తికరంగా మారింది. మలయాళ నటి పార్వతి తిరువోతు ‘కెప్టెన్ ఇండియా’లో కార్తీక్ ఆర్యన్తో కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే కార్తీక్ ఆర్యన్తో పార్వతి కాంబినేషన్ ఎలా ఉండబోతుంది, ఆమె పాత్ర కథలో ఎంత ప్రాధాన్యత ఉంటుంది అనేది గోప్యంగానే ఉంచారు.
‘కెప్టెన్ ఇండియా’ తొలుత 2021లో విడుదల చేయాలని భావించారు. ఆ సమయంలో ఈ ప్రాజెక్ట్కు హన్సల్ మెహతా దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఆయన ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ప్రాజెక్ట్ భవిష్యత్తుపై సందేహాలు నెలకొన్నాయి. ఆ తర్వాత కొంతకాలం సినిమా గురించి పెద్దగా అప్డేట్స్ కనిపించలేదు. ఇప్పుడు ‘చక్ దే ఇండియా’ వంటి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న షిమిత్ అమిన్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ను 2026లో తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో సినిమా క్రేజీ అప్డేట్స్ తో ముందుకు సాగుతోంది.
ఇక పార్వతి తిరువోతు విషయానికి వస్తే.. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా మలయాళం, తమిళ సినిమాల్లో విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తన నటనతో ప్రశంసలు అందుకున్నారు. అయితే బాలీవుడ్లో మాత్రం ఆమె ప్రయాణం చాలా పరిమితంగానే సాగింది. 2017లో విడుదలైన ‘ఖరీబ్ ఖరీబ్ సింగిల్’ సినిమాతో ఆమె హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత దక్షిణాది సినిమాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఇప్పుడు దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత పార్వతి మరోసారి బాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నారనే వార్త ఆమె అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ‘కెప్టెన్ ఇండియా’లో ఆమెకు కీలక పాత్ర దక్కడం కూడా ఈ రీఎంట్రీకి ప్రత్యేకతను తీసుకొచ్చింది. అయితే ఆమె పాత్ర హీరోయిన్గానే ఉంటుందా లేదా కథలో కీలకమైన మరో పాత్రనా అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
పార్వతి తిరువోతు కేరళలోని కోజికోడ్లో పుట్టారు. 2006లో ‘ఔట్ ఆఫ్ సిలబస్’ అనే మలయాళ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ‘బెంగళూరు డేస్’, ‘చార్లీ’, ‘టేక్ ఆఫ్’, ‘ఉయరే’ వంటి సినిమాల్లో చాలా పవర్ఫుల్ రోల్స్ చేసి మెప్పించారు. మలయాళంలోనే కాకుండా తమిళంలో ధనుష్తో ‘మరియాన్’, విక్రమ్తో ‘తంగలాన్’, హిందీలో ‘ఖరీబ్ ఖరీబ్ సింగిల్’ వంటి సినిమాల్లో నటించి అందరినీ ఆకట్టుకున్నారు. ఆమె నటనకు గానూ ‘టేక్ ఆఫ్’ సినిమాకి నేషనల్ అవార్డ్ (స్పెషల్ మెన్షన్) వచ్చింది. అలాగే రెండుసార్లు కేరళ స్టేట్ అవార్డ్స్, పలు ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా అందుకున్నారు. కేవలం నటనతోనే కాకుండా, సినిమాల్లో మహిళల హక్కులు, భద్రత కోసం పోరాడే ‘వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ (WCC) గ్రూప్లో ఆమె ముఖ్య సభ్యురాలిగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె కార్తీక్ ఆర్యన్తో కలిసి ‘కెప్టెన్ ఇండియా’ హిందీ సినిమాలో ఆమె పాత్ర కన్ఫార్మ కాగా , మరికొన్ని కొత్త మలయాళ ప్రాజెక్ట్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.