Reading Time: 2 minutes
IND vs SL: ఇజ్జత్ అంతా పాయే.. డెబ్యూ మ్యాచ్‌లోనే చెత్త రికార్డు మూటగట్టుకున్న లంక బౌలర్

IND vs SL: శ్రీలంక యువ ఆఫ్ స్పిన్నర్ కేశర నువాంతకు తన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే ఊహించని షాక్ తగిలింది. భారత బ్యాటర్ల వీరబాదుడును తట్టుకోలేక ఈ యంగ్ బౌలర్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 39 ఓవర్లు బౌలింగ్ చేసిన నువాంత ఏకంగా 175 పరుగులు సమర్పించుకున్నాడు. టెస్ట్ డెబ్యూలో శ్రీలంక తరఫున అత్యధిక పరుగులు ఇచ్చిన మూడో బౌలర్‌గా అతడు నిలిచాడు. లంక వైపు నుంచి అరంగేట్రంలోనే అత్యంత భారీగా పరుగులు ఇచ్చిన అవాంఛనీయ రికార్డు సూరజ్ రణదీవ్ పేరిట ఉంది. అతడు 2010లో భారత్‌పైనే 222 రన్స్ ఇచ్చాడు. అయితే నువాంత భారీగా పరుగులు ఇచ్చినా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలాంటి ముగ్గురు దిగ్గజ బ్యాటర్ల వికెట్లు పడగొట్టడం కాస్త ఊరటనిచ్చే అంశం.

దేవదత్ పడిక్కల్ వీరవిహారం

భారత ఇన్నింగ్స్‌లో యంగ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత సెంచరీతో చెలరేగిపోయాడు. లంక బౌలర్లను నలువైపులా బాదుతూ 230 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 167 పరుగులు సాధించాడు. వికెట్ కోల్పోయిన ఒత్తిడిని ఏమాత్రం దరిచేరనీయకుండా కేఎల్ రాహుల్‌తో కలిసి రెండో వికెట్‌కు 162 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత రిషబ్ పంత్‌తో కలిసి మరో 71 పరుగులు జోడించి జట్టు భారీ స్కోరుకు బలమైన పునాది వేశాడు. పడిక్కల్ ఆడిన ఈ క్లాసిక్ ఇన్నింగ్స్ జట్టుకు కొండంత బలాన్నిచ్చింది.

ఇది కూడా చదవండి: Devdutt Padikkal Girlfriend: దేవదత్ పడిక్కల్ మనసు దోచిన ఈ భామ ఎవరు?.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

 

హాఫ్ సెంచరీతో రాణించిన రాహుల్, ధ్రువ్ జురెల్

సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎంతో బాధ్యతాయుతంగా ఆడి 175 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 82 పరుగులు చేసాడు. యంగ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తన ఫార్మ్‌ను కొనసాగిస్తూ 68 బంతుల్లోనే 51 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే మంచి ఓపెనింగ్స్ లభించినా రిషబ్ పంత్ 39 రన్స్, యశస్వి జైస్వాల్ 32 రన్స్ చేసి భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 16 రన్స్, రవీంద్ర జడేజా 13 రన్స్ మాత్రమే చేశారు.

ఇది కూడా చదవండి:Rishabh Pant: టీమిండియా టెస్ట్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం.. ధోనీ రికార్డును బద్దలు కొట్టిన పంత్

462 పరుగులకు భారత్ ఆలౌట్

లోయర్ ఆర్డర్‌లో మానవ్ సుతార్ 24 పరుగులు చేయగా, మహమ్మద్ సిరాజ్ 11 పరుగులు అందించాడు. కుల్దీప్ యాదవ్ 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌట్ అయింది. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 39 ఓవర్లలో 109 పరుగులు ఇచ్చి 4 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అసిథ ఫెర్నాండో 63 పరుగులకు 2 వికెట్లు తీశాడు. పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తున్న తరుణంలో లంకను తక్కువ పరుగులకే ఆలౌట్ చేసి ఇన్నింగ్స్ విజయం సాధించాలని భారత్ పట్టుదలగా ఉంది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..