Reading Time: < 1 minute
Sergio Gor Jammu Kashmir Part Of India Omar Abdullah

Jammu Kashmir: భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో పర్యటిస్తు్న్న ఆయన బుధవారం శ్రీనగర్‌ను సందర్శించారు. కాశ్మీర్ చేరుకున్న తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘‘జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం’’ అని ఆయన కీలక ప్రకటన చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఒక అమెరికా రాయబారి కాశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

శ్రీనగర్‌కు చేరుకున్న వెంటనే, అమెరికా రాయబారి సెర్గియో గోర్ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను కలిశారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో, ఇద్దరు నాయకులు పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఎక్స్‌లో సెర్గియో గోర్, కాశ్మీర్ అభివృద్ధి, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. 15 ఏళ్లలో అమెరికా రాయబారి, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మధ్య జరిగిన తొలి ప్రత్యక్ష సమావేశం ఇదే. 2011లో చివరిసారిగా అప్పటి అమెరికా రాయబారి తియోతీ రోమర్ అప్పుడు సీఎంగా ఉన్న ఒమర్ అబ్దుల్లాను కలిశారు.మరోవైపు, ఈ సమావేశంపై స్పందించిన ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. కాశ్మీర్ సమస్యల్ని అమెరికా పరిష్కరించడని, కేంద్రమే పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు.

సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్‌కు ఆగ్రహం తెప్పించేలా ఉన్నాయి. పాకిస్తాన్‌కు అమెరికా మిత్రదేశంగా ఉంది. ఇటీవల ట్రంప్, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మధ్య సంబంధాలు బలపడ్డాయి. ఇలాంటి సమయంలో అమెరికా రాయబారి ఈ వ్యాఖ్యలు చేయడం పాకిస్తాన్‌ను ఇరుకునపెట్టేలా ఉన్నాయి.