Reading Time: 2 minutes
Bangladesh Ganga Water Treaty Guarantee Clause India

Bangladesh: భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇప్పటికే తీస్తా నది వివాదం ఉద్రిక్తంగా మారగా, ఇప్పుడు గంగా నదీ జలాలపై బంగ్లాదేశ్ కన్నేసింది. 1996 నాటి గంగ జలాల ఒప్పందం 2026 డిసెంబర్‌తో ముగుస్తోంది. ఈ ఒప్పందం పునరుద్ధరణకు ముందు, కొత్త డిమాండ్ తీసుకువచ్చింది. కొత్త ఒప్పందంలో ‘‘హామీ నిబంధన’’ను చేర్చాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తోంది. ఈ హామీ ఇస్తే వేసవి కాలంలో కూడా ఆ దేశానికి నీటి సరఫనా కొనసాగుతుంది. అవసరమైతే ఈ విషయంపై అంతర్జాతీయ వేదికను ఆశ్రయించడానికి కూడా ఢాకా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

1996 ఒప్పందంలో ముఖ్యాంశాలు..

బంగ్లాదేశ్ జలవనరుల శాఖ మంత్రి షాహిదుద్దీన్ చౌదరి అని, మంగళవారం ఢాకాలో బంగ్లాదేశ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లా అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ నిర్వహించిన “గంగా జల ఒప్పందం: పునః చర్చల అంశాలు” అనే అంశంపై జరిగిన సెమినార్‌లో ఈ విషయం చెప్పారు. గంగా జలాల పంపిణీ ఒప్పందంపై 1996 డిసెంబర్ 12న భారత్, బంగ్లాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం అప్పటి ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాల మధ్య జరిగింది. ఈ ఒప్పందం కాలపరిమితి 30 ఏళ్లు. ఇది డిసెంబర్ 2026తో ముగుస్తోంది.

వర్షాభావ లేదా నీటిమట్టం తక్కువగా ఉండే కాలాల్లో ఫరక్కా వద్ద లభించే గంగా నది జలాలను భారత్, బంగ్లాల మధ్య పంపిణీ చేయడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. ఈ ఒప్పందం ఏడాది పొడవున నీటి పంపినీకి సంబంధించింది కాదు. ప్రధానంగా జనవరి 1 నుంచి మే 31 వరకు ఉండే నీటి కొరత కాలానికి సంబంధించింది మాత్రమే.

హామీ కోసం బంగ్లాదేశ్ పట్టు..

ప్రస్తుత గంగా జలాల ఒప్పందం రూపొందించిన సమయంలో ఉన్న జల పరిస్థితులు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని బంగ్లాదేశ్ వాదిస్తోంది. వాతావరణ మార్పులు, అస్థిర వర్షపాతం, కరువు వంటి కారణాలతో నదీ ప్రవాహాలు మరింత అనిశ్చితంగా మారాయని పేర్కొంటోంది. కొత్త ఒప్పందంలో ‘సమాచార హక్కు’ (Right to Information) నిబంధనను చేర్చాలని, అలాగే 1977 గంగా ఒప్పందంలో ఉన్నా 1996 ఒప్పందంలో తొలగించిన ‘హామీ నిబంధన’ను తిరిగి చేర్చాలని బంగ్లాదేశ్ కోరుతోంది. ఈ నిబంధన ద్వారా దిగువన ఉన్న దేశానికి నిర్దిష్ట కనీస పరిమాణంలో నీటిని అందించే హామీ. ముఖ్యంగా కరువు పరిస్థితుల్లో నీటి లభ్యతను నిర్దారించడమే దీని ఉద్దేశ్యం.

ఫరక్కాపై బంగ్లాదేశ్ అసంతృప్తి..

గంగా జలాల వివాదం నేపథ్యంలో ఫరక్కా బ్యారేజ్‌ కీలకంగా మారింది. గంగా నదిలో నీటిలో కొంత భాగాన్ని హుగ్లీ నది వ్యవస్థలోకి మళ్లించేందుకు భారత్ పశ్చిమ బెంగాల్‌లో ఫరక్కా బ్యారేజ్ నిర్మించింది. ఇది ఫరక్కా ఆనకట్ట కాదని, నీటిన మళ్లీంచే నిర్మాణమే అని భారత్ చెబుతోంది. దీని ద్వారా సుమారు 40,000 క్యూసెక్కుల నీటిని ఫరక్కా కాలువలోకి మళ్లిస్తుండగా, మిగిలిన నీరు బంగ్లాదేశ్ వైపు వెళ్తోంది. అయితే.. వేసవి, కరువు పరిస్థితుల్లో ఈ కాలువ ద్వారా నీటి ప్రవాహాన్ని మళ్లిస్తున్నారని బంగ్లాదేశ్ వాదిస్తోంది. భారత్ మాత్రం గంగా నీటి ప్రవాహానికి సంబంధించిన సమాచారాన్ని బంగ్లాదేశ్‌తో క్రమం తప్పకుండా పంచుకుంటామని చెబుతోంది.

భారత్‌లో గంగా, బంగ్లాలో పద్మ..

ఉత్తరాఖండ్‌లో పుట్టే గంగానది ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మీదుగా ప్రవహిస్తుంది. పశ్చిమ బెంగాల్‌లోని ఫరక్కా బ్యారేజ్ తర్వాత గంగానది రెండు ప్రధాన ప్రవాహాలుగా విడిపోతుంది. ఒక ప్రవాహం భాగీరథి-హూగ్లీగా దక్షిణ దిశగా ప్రవహిస్తూ కోల్‌కతా మీదుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. మరో ప్రవాహం తూర్పు దిశగా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడ గంగానదిని ‘పద్మ’ అని పిలుస్తారు. బంగ్లాదేశ్‌లోని 54 ప్రధాన నదులు భారత్‌తో ఉమ్మడి జల వ్యవస్థలో భాగంగా ఉన్నాయి. గంగా, తీస్తా వంటి నదుల నీటి పంపిణీ ఇరు దేశాల సంబంధాల్లో చాలా కాలంగా కీలక అంశంగా కొనసాగుతోంది.