Reading Time: 2 minutes

శ్రావణమాసం స్పెషల్ : పూజలు, పండగలకు పర్ఫెక్ట్ ప్రసాదం.. ఐదే నిమిషాల్లో రెడీ..!

Caption of Image.

శ్రావణ శుక్రవారం ఇళ్లు, వాకిళ్లు కళకళలాడుతుంటాయి. పచ్చని గడపలు, ఆకుపచ్చని తోరణాలతో స్వాగతం చెప్తుంటాయి. వీటితో పాటు వంటింట్లో స్పెషల్ వంటకాలు రెడీ అవుతుంటాయి. రుచికరమైన ఆ వంటల కోసం గంటలు గంటలు వంటింట్లో తిప్పలు పడకుండా తక్కువ టైంలో, టేస్టీగా తయారైతే బెటర్ కదా! అలాంటి కొన్ని రెసిపీస్ ఈ ఫ్రైడే  రోజు స్పెషల్ గా మీ కోసం…

శెనగపప్పు  గుగ్గిళ్ళు 

కావాల్సినవి:
శెనగపప్పు-అరకప్పు
కొబ్బరి తురుము – మూడు టేబుల్ స్పూన్లు 
ఆవాలు, మినపప్పు- ఒక్కోటి అర టీస్పూన్ చొప్పన
ఇంగువ – చిటికెడు
పసుపు-చిటికెడు
ఎండుమిర్చి-రెండు 
కరివేపాకులు-కొన్ని
నూనె – రెండు టీస్పూన్లు
ఉప్పు- రుచికి సరిపడా

తయారీ విధానం: 
శనగపప్పును నీళ్లలో రెండు గంటలు నానబెట్టి వడకట్టాలి. ఆ పప్పులో పరిపడా నీళ్లు పోసి, పసుపు వేసి ఉడికించాలి. తరువాత నీళ్లను వంపేసి  ఉడికిన శనగపప్పును పక్కన పెట్టాలి. పాన్లో నూనె వేడిచేసి ఆవాలు, మినపప్పు వేసి అవి చిట పటమంటున్నప్పుడు కరివేపాకు. ఇంగువ, ఎండుమిర్చి తునకలు వేసి కొన్ని సెకన్లు వేగించాలి. ఇందులో ఉడికించి, వడకట్టిన శెనగపప్పు వేయాలి. పైనుంచి ఉప్పు చల్లి రెండు నిమిషాలు వేగించాలి. తరువాత కొబ్బరి తురుము వేసి కలిపి స్టవ్ మీద నుంచి పాన్ దింపేయాలి.

గోధుమ రవ్వ, కొబ్బరి పాయసం

కావాల్సినవి:
గోధుమ రవ్వ – పావు కప్పు
బెల్లం పొడి – అర కప్పు 
కొబ్బరి తురుము – అర కప్పు 
పాలు (కాచి, చల్లార్చి) – ఒక కప్పు
మంచినీళ్లు-ఒక కప్పు
 జీడిపప్పులు -ఎనిమిది
ఎండుద్రాక్షలు-ఎనిమిది
నెయ్యి -ఒక టేబుల్ స్పూన్
యాలకుల పొడి – పావు టీస్పూన్

తయారీ విధానం:
పాన్ లో  నెయ్యి వేడిచేసి, జీడిపప్పుల్ని బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. తరువాత ఎండుద్రాక్షలు వేసి అవి ఉబ్బే వరకు వేగించి ప్లేట్ లోకి తీసి పెట్టాలి. అదే పాన్లో గోధుమరవ్వ వేసి సన్నటి మంట మీద మూడు నిమిషాలు లేదా మంచి
వాసన వచ్చి, రవ్వ రంగు మారేవరకు వేగించాలి. తరువాత కొబ్బరి తురుము వేసి అది పచ్చివాసన పోయాక మరిగించిన నీళ్లను వేగించిన గోధుమరవ్వలో పోయాలి. పాన్ మీద మూత పెట్టి సన్నటి మంట మీద ఏడెనిమిది నిమిషాలు లేదా రవ్వ ఉడికే వరకు ఉంచాలి. తరువాత బెల్లం తురుము వేసి కరిగే వరకు కలపాలి. యాలకుల పొడి వేసి మళ్లీ ఒకసారి కలపాలి. దాన్ని మరో రెండు నిమిషాలు ఉడికించాలి. మంట తగ్గించి చల్లారబెట్టాలి. తరువాత అందులో పాలు పోసి గరిటెతో బాగా కలపాలి. పైన వేగించిన జీడిపప్పు, ఎండుద్రాక్షలు వేయాలి. దీన్ని అప్పటికప్పుడు వేడిగా లేదా చల్లగా తింటే బాగుంటుంది.

ఈ పాయసం తయారీలో గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే పాలు కలిపాక వేడి చేయొద్దు. అలాగానీ చేస్తే పాయసం విరిగిపోతుంది.

©️ VIL Media Pvt Ltd.