
రాజకీయాల్లో సైలెంట్గా తెరవెనుక పనిచేసే ఒక మేధావి వేసే వ్యూహం.. అధికార పీఠాలను తలకిందులు చేయగలదు! 2022లో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ చారిత్రక విజయానికి ప్రధాన ఇంజిన్గా నిలిచిన వ్యక్తి… ఇప్పుడు ప్రత్యర్థి శిబిరంలో కీలక ఆయుధంగా మారారు.
ఏప్రిల్ నెలలో ఆప్ నుంచి బీజేపీలోకి ఏడుగురు రాజ్యసభ ఎంపీలు చేరారు. నాలుగు నెలల తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రకటించిన 65 మంది సభ్యుల కొత్త టీమ్లో కేవలం సందీప్ పాఠక్కు మాత్రమే జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు దక్కాయి. కేంబ్రిడ్జ్ సైంటిస్ట్ నుంచి రాజకీయ వ్యూహకర్తగా మారిన పాఠక్ను బీజేపీ ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంది? 2027 పంజాబ్ అసెంబ్లీ ముఖచిత్రాన్ని మార్చేందుకు తెరవెనుక మొదలైన రాజకీయ ఆపరేషన్ ఏమిటి?
భారత రాజకీయాల్లో సందీప్ పాఠక్ ప్రయాణం అత్యంత అరుదైనది. ఛత్తీస్గఢ్లో జన్మించిన పాఠక్, సైన్స్ విభాగంలో ఉన్నత పరిశోధనలు చేసి ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్, ఎంఐటీలలో రీసెర్చ్ అసోసియేట్గా, ఐఐటీ ఢిల్లీలో ఫోటోవోల్టాయిక్ టెక్నాలజీ విభాగంలో అధ్యాపకుడిగా పనిచేశారు. అయితే అకడమిక్ రంగాన్ని వీడి రాజకీయాల్లోకి ప్రవేశించిన పాఠక్.. సాంప్రదాయ నాయకుడిలా కాకుండా డేటా, శాస్త్రీయ సర్వేలు, బూత్ స్థాయి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఎన్నికల మైక్రో-ప్లానింగ్ చేయడంలో పేరుపొందారు. ఈ నైపుణ్యమే ఆయనను అరవింద్ కేజ్రీవాల్కు అత్యంత విశ్వసనీయ వ్యూహకర్తగా మార్చింది.
సందీప్ పాఠక్ కెరీర్లో అతిపెద్ద మైలురాయి 2022 పంజాబ్ శాసనసభ ఎన్నికలు. సంప్రదాయ పార్టీలైన కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్లను పక్కకు నెట్టి, మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ ఏకంగా 92 సీట్లు గెలుచుకుంది. భగవంత్ మాన్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గ్రౌండ్-లెవల్ ఆర్కిటెక్ట్గా పనిచేసింది సందీప్ పాఠకే. నియోజకవర్గాల వారీ సమస్యలను గుర్తించి, ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మార్చడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఈ ఘనతతో 2022లో పంజాబ్ నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లలో బాధ్యతలతో పాటు డిసెంబర్ 2022 నాటికి ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు.
అయితే ఈ ఏడాది ఏప్రిల్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆప్ కి చెందిన ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరారు. రాఘవ్ చద్దా, హర్భజన్ సింగ్, స్వాతి మాలీవాల్, అశోక్ మిట్టల్, విక్రమ్జిత్ సింగ్ సాహ్నే, రాజేందర్ గుప్తాలతో పాటు సందీప్ పాఠక్ కూడా కమలం గూటికి చేరారు. అందరూ రాఘవ్ చద్దా వంటి ప్రముఖ పార్లమెంటరీ లేదా మీడియా ఫేస్లు ఉన్నవారికి బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో స్థానం దక్కుతుందని భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఒక్క సందీప్ పాఠక్కు మాత్రమే సంస్థాగత కార్యదర్శి పదవిని కేటాయించింది బీజేపీ హైకమాండ్. దీని వెనుక ప్రత్యేక రాజకీయ సమీకరణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సందీప్ పాఠక్ నియామకానికి ప్రధాన నేపథ్యం పంజాబ్ రాజకీయాలే. పంజాబ్లో గతంలో శిరోమణి అకాలీదళ్తో ఉన్న పొత్తు వీడిన తర్వాత, రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. అర్బన్, హిందూ మెజారిటీ ప్రాంతాలకే పరిమితమైన బలాన్ని గ్రామీణ, సిక్కు ప్రాబల్య ప్రాంతాలకు విస్తరించాలంటే లోతైన బూత్ స్థాయి యంత్రాంగం అవసరం. ప్రత్యర్థిగా ఉన్న ఆప్ క్షేత్రస్థాయి నెట్వర్క్ను ఎలా నిర్మించిందో సందీప్ పాఠక్ కు అణువణువూ తెలుసు. అందుకే పాఠక్ నైపుణ్యం, బీజేపీకి కీలక సమాచారాన్ని, వ్యూహాత్మక ఆధిక్యాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.
రాజకీయాల్లో నాయకుల వలసలు కేవలం సంఖ్యాబలానికి మాత్రమే పరిమితం కావు.. కీలకమైన వ్యూహాలు, సంస్థాగత రహస్యాలు కూడా ప్రత్యర్థి శిబిరంలోకి చేరుతాయి. గతంలో ఆప్ విజయానికి బ్లూప్రింట్ గీసిన అదే వ్యూహకర్తతో, ఇప్పుడు అదే పార్టీపై పైచేయి సాధించేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. పదవి చిన్నదా, పెద్దదా అన్నది కాకుండా, ఆ పదవికి కేటాయించిన బాధ్యత రాబోయే పంజాబ్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో కాలమే తేల్చాలి.
:- CLN RAJU(EDITOR-NTV DIGITAL)