
Kolkata Hotel Fire: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నగరంలోని మీర్జా గాలిబ్ వీధిలో ఉన్న ఓ హోటల్లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు తొమ్మిది మంది మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
తెల్లవారుజామున 1:45 గంటలకు ఘటన
పోలీసుల వివరాల ప్రకారం.. తెల్లవారుజామున సుమారు 1:45 గంటల సమయంలో హోటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఐదు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మంటల కారణంగా హోటల్ మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది మెట్ల మార్గం ద్వారా పై అంతస్తులకు చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
ఇప్పటివరకు తొమ్మిది మంది మృతి చెందినట్లు నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, గాయపడిన ఆరుగురిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. హోటల్లో ఎవరైనా ఇంకా చిక్కుకున్నారా అనే విషయాన్ని నిర్ధారించి, వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడమే ప్రస్తుతం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. అదే సమయంలో అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏమిటనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయం హోటల్కు సమీపంలోనే ఉండటం గమనార్హం. వరుసగా చోటుచేసుకుంటున్న హోటల్ అగ్నిప్రమాదాలు పశ్చిమ బెంగాల్లో భద్రతా ప్రమాణాలపై మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. హోటళ్లలో అగ్నిమాపక పరికరాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, భద్రతా వ్యవస్థలను అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.