Reading Time: 2 minutes
Hockey World Cup 2026: మరోసారి భారత్ పాక్ పోరు.. గెలవకపోతే ఇంటిముఖం పట్టాల్సిందే ?

Hockey World Cup 2026: పురుషుల హాకీ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో ఎదురైన 2-4 ఓటమి భారత జట్టు సెమీఫైనల్ ఆశలను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రస్తుతం మూడు పాయింట్లతో పూల్-డి లో రెండో స్థానంలో ఉన్న భారత్, తర్వాతి రౌండ్‌ దాటాలంటే ఆగస్టు 19న పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించడం అత్యవసరం.ఈ ఓటమి ప్రభావం రెండో రౌండ్‌లోనూ కొనసాగే అవకాశం ఉండటం అభిమానులను కలవరపెడుతోంది. ర్యాంకింగ్స్ పరంగా చూస్తే భారత్ 8వ స్థానంలో, పాకిస్తాన్ 12వ స్థానంలో ఉన్నప్పటికీ, మైదానంలో సాంప్రదాయ ప్రత్యర్థుల మధ్య పోరు ఎప్పుడూ ఒత్తిడితో కూడుకున్నదే. ఒకవేళ భారత్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమించడం ఖాయమవుతుంది. డ్రా చేసుకుంటే మాత్రం వేల్స్‌పై ఉన్న మెరుగైన రికార్డు ఆధారంగా రెండో రౌండ్‌కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది.

వెంటాడుతున్న మొదటి రౌండ్ ఓటమి

ఈసారి హాకీ ప్రపంచకప్‌లో ప్రవేశపెట్టిన కొత్త నియమాలు భారత జట్టుకు పెద్ద సవాలుగా మారాయి. గతంలా క్వార్టర్ ఫైనల్స్ నిర్వహించకుండా, తొలి రౌండ్ నుంచి అర్హత సాధించిన ఎనిమిది జట్లను క్రాస్‌ఓవర్ పూల్స్(ఈ, ఎఫ్) పేరిట రెండు గ్రూప్‌లుగా విడదీస్తారు. తొలి రౌండ్‌లో ఎదురైన ఫలితాల పాయింట్లు, గోల్స్ వ్యత్యాసం నేరుగా రెండో రౌండ్‌కు కూడా వర్తిస్తాయి.

పాకిస్తాన్‌పై భారత్ విజయం సాధించి పూల్-డి నుంచి రెండో స్థానంతో ముందంజ వేసినా, పూల్-ఎ లో అగ్రస్థానాల్లో నిలిచే జట్లతో కలసి పూల్-ఈ లో పోరాడాల్సి ఉంటుంది. అక్కడ ఇంగ్లాండ్‌తో మళ్లీ మ్యాచ్ ఉండదు, కానీ ఇంగ్లాండ్ చేతిలో పొందిన ఈ ఓటమి పాయింట్ల పట్టికపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంటే, పూల్-ఈ లో భారత్ సెమీఫైనల్ బెర్త్ దక్కించుకోవాలంటే తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ కచ్చితంగా గెలిచి తీరాలి.

నెదర్లాండ్స్, అర్జెంటీనాలతో కఠిన పరీక్షలు

రెండో రౌండ్‌లో భారత్‌కు ఎదురయ్యే ప్రత్యర్థులు సామాన్యమైనవారు కాదు. పూల్-ఎ నుంచి మాజీ ఛాంపియన్ నెదర్లాండ్స్, ఒలింపిక్ విజేత అర్జెంటీనా గ్రూప్-ఈ లోకి అడుగుపెట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో అర్జెంటీనాతో జరిగిన చివరి నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారత్ పరాజయం పాలైంది. అలాగే నెదర్లాండ్స్‌పై గడిచిన పది మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలు మాత్రమే నమోదు చేయగలిగింది.

1975 తర్వాత మళ్లీ ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరుకోలేకపోయిన భారత్, ఈసారి ఆ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలంటే మైదానంలో అద్భుతాలు చేయాల్సిందే. ఇంగ్లాండ్‌పై చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని, వ్యూహాత్మక దృఢత్వంతో ఆడితేనే భారత హాకీ జట్టు ఆశలు సజీవంగా ఉంటాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.