Reading Time: < 1 minute
Chandrababu Naidu Flags Group 1 Recruitment Irregularities

CM Chandrababu: అసెంబ్లీలో గ్రూప్-1 నియామకాల వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 పరీక్షలు, నియామకాల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా కాకుండా అక్రమ పద్ధతుల్లో ఉద్యోగాల భర్తీ జరిగిందని విమర్శించారు. గ్రూప్-1 వ్యవహారంలో కోర్టును కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కోర్టును తప్పుదారి పట్టించేందుకు తప్పుడు అఫిడవిట్ సమర్పించారని అన్నారు. పేపర్ల మూల్యాంకన బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారని, ఇది మొత్తం ప్రక్రియపై అనేక అనుమానాలకు తావిచ్చిందని పేర్కొన్నారు.

ఎంతోమంది విద్యార్థులకు సివిల్స్, గ్రూప్స్ ఉద్యోగాలు జీవితాశయమని చంద్రబాబు అన్నారు. అలాంటి అభ్యర్థుల భవిష్యత్తుతో గత ప్రభుత్వం ఆటలాడిందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం కోల్పోయేలా వ్యవహరించారని ఆరోపించారు. గ్రూప్-1 పేపర్ల మూల్యాంకనంలోనూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని సీఎం తెలిపారు. మొదట మాన్యువల్‌గా పేపర్లు దిద్దేందుకు హైదరాబాద్‌కు పంపారని, అనంతరం హాయ్‌ల్యాండ్‌లో మాన్యువల్ వాల్యుయేషన్ నిర్వహించారని పేర్కొన్నారు. ఈ మొత్తం ప్రక్రియలో పారదర్శకతపై అనేక ప్రశ్నలు తలెత్తాయని అన్నారు.

గత ప్రభుత్వం ఏపీపీఎస్సీ చైర్మన్‌ను కూడా నిస్సహాయ స్థితిలోకి నెట్టిందని చంద్రబాబు ఆరోపించారు. గ్రూప్-1 పేపర్ల మూల్యాంకన ప్రక్రియ మార్కెట్‌లో కూరగాయల మార్కెట్ తరహాలో సాగిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివిధ నివేదికలను పరిశీలిస్తే భయంకరమైన నిజాలు బయటపడుతున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గ్రూప్-1 నియామకాల విషయంలో జరిగిన పరిణామాలపై సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. విద్యార్థులు, అభ్యర్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఇలాంటి నియామకాల్లో పూర్తి పారదర్శకత, నిష్పక్షపాతంగా వ్యవహరించడం అత్యంత ముఖ్యమని ప్రభుత్వం చెబుతోంది అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..