
భారతీయ రైల్వే ప్రయాణికులకు బిగ్ అప్డేట్ ఇచ్చింది. దూర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం 50 కొత్త వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా ఈసారి ఒక్కో రైలులో 16 కోచ్లకు బదులుగా ఏకంగా 24 కోచ్లను ఏర్పాటు చేయనున్నారు.
వందే భారత్ స్లీపర్ రైళ్ల విశేషాలు:
*ఈ 24-కోచ్ల కొత్త వందే భారత్ స్లీపర్ రైళ్లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో తయారు చేయనున్నారు. వీటి డిజైన్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
*ప్రస్తుతం ఉన్న 16-కోచ్ల రైళ్లతో పోలిస్తే, ఈ కొత్త 24-కోచ్ల రైళ్లలో ఒకటిన్నర (1.5) రెట్లు ఎక్కువ మందికి సీట్లతో ఎక్కువ మంది ప్రయాణించవచ్చు.
* ఇప్పటివరకు వందే భారత్ రైళ్లు ఎక్కువగా పగటిపూట కూర్చుని ప్రయాణించే (చైర్ కార్) రూపంలోనే ఉండేవి. ఇకపై రాత్రిపూట దూర ప్రాంతాలకు వేగంగా, హాయిగా వెళ్లాలనుకునే వారి కోసం ఈ స్లీపర్ రైళ్లను తీసుకొస్తున్నారు.
*సీట్ల సంఖ్య పెరగడం వల్ల దేశవ్యాప్తంగా మరిన్ని కొత్త రూట్లలో ఈ స్లీపర్ సర్వీసులను ప్రారంభించేందుకు రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది.
కేరళ ప్రయాణికులకు ఓనం గిఫ్ట్ :
పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని కేరళలోని ఎర్నాకులం – బెంగళూరు మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ కోచ్ల సంఖ్యను 8 నుండి 16కి పెంచారు. దీనివల్ల ప్రయాణికుల సీట్ల సామర్థ్యం 530 నుంచి ఏకంగా 1,128కి పెరిగి రెట్టింపు అయింది. ఆగస్టు 17న కేంద్ర మంత్రి సురేష్ గోపి ఈ 16-కోచ్ల రైలును జెండా ఊపి ప్రారంభించారు.
►ALSO READ | వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా.. మన దేశ తొలి ఫొటోగ్రాఫర్ గురించి ఆసక్తికర విషయాలు