Reading Time: 2 minutes

500 రూపాయల పెట్రోల్ ఫ్రీ అనగానే నడి వానను కూడా లెక్క చేయకుండా పోతే..

Caption of Image.

ఫ్రీ పెట్రోల్ అనగానే భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా వాహనదారులు క్యూ కట్టి వెళ్లిన ఘటన చండీగఢ్లో కలకలం రేపింది. బైక్కు 500 రూపాయల పెట్రోల్, కార్లకు వెయ్యి రూపాయల ఫ్యూయల్ అని రాజా డి కింగ్ అని ఫేమస్ అయిన రాకేష్ ట్రెహాన్ సోషల్ మీడియాలో ప్రకటించాడు.

ఈ ప్రకటన చూసి జనం గుంపులుగుంపులుగా పెట్రోల్ బంక్ దగ్గరకి వెళ్లారు. సెక్టార్ 10లోని ఒక పెట్రోల్ బంక్ దగ్గరకు భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వెళ్లారు. వర్షంలో తడిసి ముద్దయ్యారు. పెట్రోల్ బంక్ ముందు ఉన్న రోడ్డుపై ట్రాఫిక్కు కారణమయ్యారు. ఇంత చేసినా పర్మిషన్ లేకపోవడంతో చుక్క పెట్రోల్ కూడా ఒక్కరికీ దక్కలేదు.

చండీగఢ్ సిటీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భారీగా ఫ్రీ పెట్రోల్ కోసం వెళ్లడంతో రోడ్డు మీద వందలాది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో.. పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. చండీగఢ్ సిటీలో లీటర్ పెట్రోల్ 101 రూపాయలకు పైగానే ఉంది. అలాంటిది 500 రూపాయల పెట్రోల్ ఫ్రీ అని ప్రకటిస్తే వాహనదారులు పోటెత్తారు. వాహనదారుల కారణంగా పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పెట్రోల్ బంక్ మూసివేయించారు.

ట్రాఫిక్‌కు తిప్పలకు కారణమైనందుకు, అక్రమంగా వాహనాలను పార్క్ చేసినందుకు ఫ్రీ పెట్రోల్ కోసం అక్కడికి వెళ్లిన చాలా వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామంపై అక్కడికి వెళ్లిన వాహనదారులు భగ్గుమన్నారు. అనుమతి లేకుండా ఇలాంటి ప్రకటనలు చేసి వచ్చిన వాళ్లను ఇలా నడి వానలో నిలబెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ఆగస్టు 18న నెలకొన్న గందరగోళం, అంతరాయం కారణంగా.. ‘పెట్రోల్ లంగర్’ ప్రోగ్రాంను ఆగస్టు 21కి వాయిదా వేసినట్లు ట్రెహాన్ ప్రకటించారు. అసౌకర్యానికి ఆయన క్షమాపణలు చెప్పారు. చండీగఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాల మధ్య తొలి ప్రయత్నం ఘోరంగా విఫలమైన తర్వాత రాకేష్ నుంచి ఈ ప్రకటన వెలువడింది.

©️ VIL Media Pvt Ltd.